నేడు రైతన్నల ఖాతాల్లో వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం

వరుసగా నాలుగో ఏడాది రెండో విడత పథకం అమలు

ఆళ్లగడ్డ నుంచి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096 కోట్లు జమ చేయనున్న సీఎం వైయస్‌ జగన్‌

నేటితో కలిపి రైతుభరోసాతో అందించిన మొత్తం రూ.25,971.22 కోట్లు

తాడేపల్లి: వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా తోడుగా నిలుస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రెండో విడతగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ జమ చేయనున్నారు. 50.92 లక్షల మంది రైతన్నల బ్యాంక్‌ ఖాతాల్లో నేడు రూ.2,096.04 కోట్లు జమ కానున్నాయి. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. 

ప్రతి ఏటా మూడు విడతల్లో రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. నాలుగో ఏడాది మొదటి విడతగా మే నెలలో ఖరీష్‌కు ముందే రైతులకు ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందించింది. నేడు రెండో విడతగా పంట కోతలు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికీ మరో రూ.4000 చొప్పున 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సీఎం వైయస్‌ జగన్‌ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.2,096.04 కోట్లతో కలిపి ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో కేవలం వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారానే వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తం రూ.25,971.22 కోట్లు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రూతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. మేనిఫెస్టోలో నాలుగు ఏళ్లపాటు రూ.12,500 చొప్పున ఇస్తామని మాటిచ్చిన సీఎం వైయస్‌ జగన్‌.. ఇచ్చిన మాట కంటే మిన్నగా రైతు భరోసా సాయం ఐదు సంవత్సరాల పాటు రూ.13,500 చొప్పున.. చెప్పిన మాట కంటే మిన్నగా అదనంగా రూ.17,500 అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడున్నరేళ్ల పాలనలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు రూ.1,33,526.92 కోట్ల లబ్ధి చేకూర్చింది. 
 

Back to Top