తూర్పు గోదావరి: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలని, ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటానని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్వార్ జరుగుతోందన్నారు. ఇవాళ కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: మే నెలలో మండే ఎండలోనూ, చెక్కుచెదరని చిరునవ్వులతో, చిక్కటి ఆప్యాయతల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి స్నేహితుడికీ, సోదరుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం... ఈ రోజు దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో కొవ్వూరులో మరో మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. దాదాపుగా 9.95 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు దాదాపు రూ.703 కోట్లను 8,91,180 మంది వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. పేదరికం పోవాలంటే గొప్ప అస్త్రం – చదువు. మన సమాజంలో తరతరాలుగా పేదరికంలో ముగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. తరతరాలుగా పేదరికంతో మగ్గిపోతున్న వెనుకబడిన కులాల కుటుంబాల తలరాతలు మారాలని, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలని, ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్ వంటి పెద్ద చదువులతో పిల్లలు బయటకు రావాలని, మంచి ఉద్యోగాలు చేసి పేదరికం సంకెళ్లు తెంచుకుని దాన్నుంచి బయటపడాలని.. దానికి చదువు ఒక్కటే మార్గమని ఈ నాలుగేళ్ల మన పాలనలో మీ వాడిగా అడుగులు వేశాను. పేదరికంలో మగ్గిపోతున్న నా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగానూ, ఆర్ధికంగాను గట్టిగా నిలబడాలంటే.. వారి పట్ల ఉన్న వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే అందుకు చదువు ఒక్కటే మార్గమని గతంలో చాలామంది గొప్పవాళ్ల చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రీ బాయి పూలే, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఇలా ఏ గొప్ప వ్యక్తిని తీసుకున్నా వారి నోటిలోంచి వచ్చే మాట. వివక్ష, పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదువు అనేది గొప్ప అస్త్రం అన్న మాట వినిపిస్తుంది. చదువుల విప్లవం దిశగా... ఈ రోజు అలాంటి చదువులు విప్లవం దిశగా మార్పులు వచ్చేటట్టుగా మన రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అడుగులు వేశాం. పెద్ద చదువులు పేదలందరికీ హక్కుగా అందాలని, ప్రతి కుటుంబంలోనూ ఆ పెద్ద చదువులు దక్కాలని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పెద్ద చదువులు చదువుకుంటున్న పిల్లలు కట్టవలిసిన పూర్తి ఫీజులను వాళ్ల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు కొవ్వూరులో హోంమినిష్టర్, నా చెల్లెమ్మ వనిత నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం చేయడం సంతోషం. ఈ త్రైమాసికానికి సంబంధించి రూ.703 కోట్లు... ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది పిల్లలకు పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ డబ్బులు రూ.703 కోట్లను 8.91 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన కోసమే రూ.14,912 కోట్లు ఖర్చు ఈ రోజు జమ చేస్తున్న రూ.703 కోట్లు కలుపుకుంటే ఈ ఒక్క జగనన్న విద్యాదీవెన పథకానికే ఏకంగా రూ.10,636 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన వల్ల 26.98 లక్షల మంది ప్రయోజనం పొందారు. మీ అందరికీ గుర్తు ఉండేఉంటుంది.. చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు. 2017 నుంచి రూ.1,777 కోట్ల రూపాయలు చంద్రబాబు బకాయిపెట్టాడు. ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది. పిల్లలు వందశాతం ఫీజులు మాత్రమే ఇస్తే సరిపోదు, వారి బోర్డింగ్, లాడ్జింగ్ ఫీజుల చెల్లించడం కోసం ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని, వాటి కోసం చదువు ఆగిపోయే పరిస్థితులు రాకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం ద్వారా ఆ బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10వేలు, పాలిటెక్నిక్ పిల్లలకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న పిల్లలకు రూ.20వేలు ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. దీన్ని అక్షరాల 25.17 లక్షల మందికిపైగా వర్తింపుచేస్తున్నాం.నాలుగేళ్లలో కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం. పిల్లలు బాగా చదవాలని వారి ఉన్నత విద్య కోసం జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన అనే రెండే రెండుపథకాలు కోసం రూ.14,912 కోట్లు ఖర్చు చేశాం. ఈ డబ్బులన్నీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఈ డబ్బులు అందుకున్న తర్వాత తల్లులు వారం పదిరోజుల తర్వాత కాలేజీలకు వెళ్లి... అక్కడ వసతులన్నీ చూసి, పిల్లలు ఎలా చదువుతున్నారని విచారణ చేసి, వారికి బాసటగా ఫీజులు కట్టే కార్యక్రమం తల్లులకే అప్పగించాం. గతంలో అరకొరా ఫీజులు... గతానికీ ఇప్పటికీ తేడా చూడండి. అప్పట్లో చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఫీజులు అరకొరగా ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితులు.. ఇచ్చింది కూడా కేవలం కొంతమందికే పరిమితం చేసేవారు. ఆ ఇచ్చిన అమౌంట్ కూడా ముష్టి వేసినట్టు కేవలం రూ.35వేలు ఇచ్చేవారు. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ... చదువుకుంటున్న పిల్లల ఫీజులు ఎంతుంటే అంతా మన ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక ఇంజనీరింగ్ తమ్ముడు వచ్చి మాట్లాడుతూ అన్నాడు.. తన ఇంజనీరింగ్ ఫీజు రూ.63వేలు అయితే కేవలం రూ.35వేలు కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి అయితే ఆ పిల్లవాడు చదువులు మానేయక ఏమవుతాడు ఆన్న పరిస్థితి ఆలోచిస్తేనే ఒక్కోసారి భయమవుతుంది. ఫీజులు ఎంతైనా మీ అన్న చదివిస్తాడు... అందుకే మన పిల్లలందరికీ మంచి జరగాలని.. ఎంత ఫీజులైనా రూ.60వేలు, రూ.70 వేలు, రూ.1లక్ష, రూ.1.20 లక్షలైనా ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి మీ జగనన్న చదవిస్తాడు. ప్రతి అక్కకూ చెబుతున్నాను మీ పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఎంత మంది పిల్లలుంటే అంతమందిని చదవించండి. అన్ని రకాలుగా ఆ పిల్లలకు తోడుగా ఉంటాను. ఈ కాలేజీలలో చదువుతున్న పిల్లల మీద మనం పెడుతున్న ఖర్చుకు సంబంధించి, ఒక్కో విద్యార్ధి మీద వసతి దీవెన, విద్యాదీవెన కింద ఇంత డబ్బులిస్తుంటే, ఇలాంటి పథకాలు ఇస్తుంటేం రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయి. ప్రతిపక్ష నాయకులూ నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారు. చెడిపోయిన మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి. చదువుల మీద ఖర్చు– మానవవనరుల పెట్టుబడి. పిల్లల చదువులు మీద మనం చేస్తున్న ఖర్చు భావితరాల పిల్లల తలరాతలు మార్చేందుకు మేం పెట్టే ఖర్చు.. మానవ వనరులమీద పెడుతున్న పెట్టుబడులు అని ఈ జ్ఞానం లేనివారికి చెప్తున్నాను. ఈ రోజు మనం ఒక విత్తనం విత్తుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్ధి మంచి ఇంజనీరింగ్, డాక్టర్ వంటి పెద్ద డిగ్రీలతో బయటకు వస్తే... భావితరానికి స్కిల్డ్ మ్యాన్ పవర్కు కేరాఫ్ అడ్రస్సుగా ఆంధ్రరాష్ట్రం నిలుస్తుంది. ఇలాంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది. నర్సరీ నుంచి పీజీ వరకూ విప్లవాత్మక మార్పులు.. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. అందులో చదువులు కూడా మారుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ ఇంగ్లిషు మీడియం చదువులు వచ్చాయి. బై లింగువల్ టెక్ట్స్బుక్స్ వచ్చాయి. ఒక పేజీ ఇంగ్లిషు పక్కన మరో పేజీలో తెలుగు ఉంటుంది. మనం తీసుకువస్తున్న గొప్ప మార్పులకు నిరద్శనం ఇది. మోనూలో మార్పులు... సంపూర్ణ పోషణం, రోజుకోమెనూతో గోరుముద్ద పథకాలు వీటి ద్వారా అంగన్వాడీల స్వరూపం కూడా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈ విషయంలో అక్షరాల ఒక్కో పథకానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలకు ట్యాబులిచ్చిన ఏకైక ప్రభుత్వం... విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం. స్కూళ్లు తెరిచేనాటికి వారికి అందేటట్టుగా చేయడానికి ప్రత్యేక ధ్యాస పెట్టాం. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మనం ఇస్తున్న అమ్మఒడి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. అది కేవలం మన ప్రభుత్వంలోనే ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పేదపిల్లవాడిలో స్పష్టమైన మార్పు కనిపించేలా.. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం. ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండేలా అడుగులు వేశాం. పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ ఇచ్చాం. ఆఫ్లైన్లో పనిచేసే విధంగా ట్యాబులు ఇచ్చాం. 8వతరగతిలోకిప్రవేశించిన ప్రతి విద్యార్ధికి ట్యాబులు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే. 30వేలకుపైగా డిజిటల్ క్లాస్ రూమ్లు.. 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో మార్పు ఏ స్ధాయిలో జరుగుతుందంటే.. నాడు – నేడు పూర్తిచేసుకున్న మొదటి దఫా 15,750 స్కూళ్లలో ఈ జూన్ 12వ తేదీలోగా 6 నుంచి పై తరగుతులు అన్నింటికీ డిజిటల్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 30,230 తరగతిగదుల్లో ఐఎఫ్పీ ప్యానెల్స్ద్వారా డిజిటల్ బోధన తీసుకువస్తున్న ప్రభుత్వం మనదే. ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు పూర్తైతే... ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేటు స్కూల్స్ పోటీపడే పరిస్థితి వస్తుంది. సత్ఫలితాల దిశగా.... మనం తీసుకువస్తున్న మార్పులన్నీ సత్ఫలితాలనిస్తున్నాయి. 2018–19 అంటే గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే..ఈ రోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటింది. ఏ స్ధాయిలో మనం సౌకర్యాలు కల్పిస్తున్నామో అన్నదానికి ఇది నిదర్శనం. మనం తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం కలిగింది. డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి. 12వ తరగతి తర్వాత డిగ్రీల్లో చేరకుండా చదువులు ఆపేసిన పిల్లలు 2018–19లో 81,813 ఉంటే ఈ నాలుగేళ్లలో మీ ప్రభుత్వంలో ఈ సంఖ్య 2022–23 నాటికి 22,387కు తగ్గించగలిగాం. ఈ సంఖ్యను ఇంకా తగ్గించడానికి తగిన అడుగులు వేస్తున్నాం. ఉన్నత విద్యలోనూ సమూల మార్పులు... 2018–19లో ఇంజినీరింగ్ చదివేవాళ్లు 87వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 2022–23లో 1.20 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50శాతం వృద్ధి ఉంది. ఉన్నత విద్యలో పాఠ్యప్రణాళికను మార్చాం. జాబ్ ఓరియంటెడ్గా తీర్చిదిద్దాం. కరిక్యులమ్లో మార్పులు తీసుకువస్తూ.. 25 మార్కెట్ ఓరియెంటెడ్, 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టాం. దిగ్గజ సంస్ధలతో ఒప్పందాలు... దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టాం. పిల్లల నైపుణ్యం పెంచడానికి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ కోర్సులు ఇప్పిస్తున్నాం. స్కిల్ ఓరియెంట్డ్గా మన పిల్లలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో పలు సంస్ధలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వారిచేత కోర్సులు చెప్పించి.. సర్టిఫికెట్లు కూడా ఇప్పించి మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు వచ్చే విధంగా అడుగులు వేయిస్తున్నాం. అమెజాన్ వెబ్సర్వీస్, సేల్స్ఫోర్స్ వంటి అనేక సంస్థలు కూడా రాష్ట్రప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యాయి. జగనన్న విదేశీ దీవెన... జగనన్న విదేశీ దీవెన ద్వారా ప్రపంచంలోనే టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలో, 350 ప్రపంచస్థాయి కాలేజీల్లో సీటు తెచ్చుకున్న పిల్లలకు రూ.1.25 కోట్ల వరకూ కూడా పూర్తిగా ఫీజులు మన ప్రభుత్వం కడుతుంది. ప్రతిభ చూపండి.. తోడుగా నేనుంటా.. సత్యానాదెళ్లలా.. మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి రావాలి. ప్రతి కుటుంబం నుంచి కూడా సత్యనాదెళ్లలు రావాలని అడుగులు వేస్తున్నాం. రూ.1.25 కోట్లు ఫీజులు కట్టాల్సి వస్తే.. స్టాన్ఫర్ట్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్లో సీటు వచ్చినా ఆ ఫీజు కట్టలేక, చదువుకోలేకపోతున్నవారందికీ చెప్తున్నా... ప్రతిభ మీరు చూపించండి.. మీ ప్రతిభకు తోడుగా నేనున్నాను. చదువులు ప్రోత్సహించేందుకు, ప్రతి ఇంటా చదువులు ఉండేందుకు.. షాదీతోఫా, కళ్యాణమస్తు లాంటి పథకాలను కూడా చదువుతోనే ముడిపెడుతున్నాం. ప్రతి ఇంట్లో చదువు ఉండేటట్టు ప్రోత్సహిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి... విమర్శించే ప్రతిపక్షాలంతా ఆలోచన చేయండి? విమర్శించే మీడియాను కూడా అడుగుతున్నాను ? మన పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువొక్కటే మార్గమని మనసా, వాచా, కర్మణా నమ్మిన ప్రభుత్వం మనది. వాళ్ల తరపున మన ప్రభుత్వం ఉందని వీళ్లందరికీ తెలియజేస్తున్నాను. విమర్శించేవాళ్లంతా ఒక్క ఆలోచన చేయండి ? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగినదా? లంచాలు ఇవ్వకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చే పరిస్థితి గతంలో ఉండేదా? అమ్మ ఒడి నుంచి చూస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత లాంటి పథకాలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయి?అప్పడూ ఇప్పుడూ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఇదే బడ్జెట్.. ఇప్పుడు కూడా అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేటు చూస్తే.. అప్పటితో చూస్తే.. ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. సీఎం మారడంతో నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.10 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశాం. ఈ డీబీటీ ఒక్కటే కాకుండా ఇంటి స్ధలాలు చూసుకుంటే.. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. దీని విలువ చూస్తే... ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ. 2.50 లక్షలు వేసుకున్నా మరో రూ.75 వేల కోట్లు అవుతుంది. ఇలా నాన్ డీబీటీ పథకాలు కూడా కలుపుకుంటే నాలుగేళ్లలో రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగింది. ఆలోచన చేయండి. గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగుతున్నాయి? కారణం గతంలో ఏ ఒక్కరూ పేదవాడి గురించి ఆలోచన చేయలేదు. పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడు. వాడికి ఏం చేయాలి ? పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న ఆలోచన చేయలేదు. గత పాలకులు– గజ దొంగల ముఠా... గతంలో పాలకులంతా గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ప్రజల గురించి వారెప్పుడూ ఆలోచన చేయలేదు. దోచుకోవడం ఎలా.. ఎలా పంచుకోవడం.. అన్నదే వారి ఆలోచన. డీపీటీ వీరి ఆలోచన. అందుకే ఏ పేపర్లోనూ రాయరు, ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు. అందుకే ప్రశ్నిస్తామన్న వాళ్లు ఏ ఒక్కరూ ప్రశ్నించరు. ఏకమవుతున్న తోడేళ్లు... ఈ రోజు తోడేళ్లంతా ఒక్కచోటకి వచ్చి ఏకమవుతామంటున్నారు. మీ జగన్ను ఒక్కడినే ఎదుర్కునేందుకు వాళ్లంతా కలిసికట్టుగా వస్తున్నారు. మీ జగన్కు వారి మాదిరిగా ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, టీవీ5 ఉండకపోవచ్చు. దత్తపుత్రుడి మద్ధతు ఉండపోవచ్చు. క్లాస్ వార్.. కానీ నేను మీ అందరికీ చెపుతున్నాను. ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నారు. మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు. కానీ నేను ఒక్కటే ఒకటి మీకు చెప్తున్నాను. మీరు ఒకటే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే.. మీజగనన్నకు తోడుగా మీరే సైనికులు కండి. నా బలం మీరు.. నా నమ్మకం మీరే. నేను దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనలను మాత్రమే నమ్ముకున్నాను. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. కాసేపటి క్రితం.. నా చెల్లి హోంమంత్రి వనిత మాట్లాడుతూ.. నియోజవర్గ అభివృద్దికి కొన్ని ప్రతిపాదనలు చెప్పింది. కొవ్వూరు డిగ్రీ కాలేజీ మంజూరు అయింది, సిబ్బంది మంజూరు అయ్యారు. భవనాల కోసం రూ.30 కోట్లు అడిగింది. దాన్ని మంజూరు చేస్తున్నాను. మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులు, మూడు అంబేద్కర్ భవనాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, కాపు భవనం, షాధీ ఖానాతో పాటు కొవ్వాడ కెనాల్ మీద కల్వర్టు కోసం కూడా అడిగింది. వీటన్నింటినీ మంజూరు చేస్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.