ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి 

హోదాతోనే సమస్యలను అధిగమించగలం

కేంద్రహోంమంత్రిని విజ్ఞప్తి చేసిన సీఎం వైయస్‌ జగన్‌

రెవెన్యూ లోటు భర్తీకి నిధులు వెంటనే విడుదల చేయండి
ప్రాజెక్టుల పూర్తికి నిధులు సమకూర్చండి

వెనుకబడిన జిల్లాలను ఆదుకోండి  

రివర్స్‌టెండరింగ్‌తో రూ.838 కోట్లు ఆదా చేశాం

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వండి

కేంద్రమంత్రి అమిత్‌షాను కోరిన సీఎం వైయస్‌ జగన్‌

ఢిల్లీ: రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలను అధిగమించగలమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. కేంద్రమంత్రి అమిత్‌ షాతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన సమావేశంలో ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం. విభజన చట్టంలోని హామీలు, వెనుకబడ్డ జిల్లాలకు నిధుల విడుదలపై అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చర్చించారు. 

పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదాతోనే ఈ సమస్యలను అధిగమించగలమని, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కాకుండా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా ఉండాలన్నారు. విభజన సమయంలో 22,948.76 కోట్లు రెవెన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందని, తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. 

ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కోసం కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం అంశాన్ని, రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్ని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రమంత్రి అమిత్‌షా వద్ద ప్రస్తావించారు. విశాఖ – చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడర్, కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. 

వెనుకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల కైటీరియాను మార్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరారు. ఏపీలో వెనుకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 ఇస్తే బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు ఇస్తున్నారన్నారు. ఇదే తరహాలో ఏపీలోని వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు రూ.2,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని.. మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని అమిత్‌షాను కోరారు. 
 
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కే రూ.33 వేల కోట్లు ఖర్చు అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్‌షాకు సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. హెడ్‌వర్క్స్, హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల్లో రూ.780 కోట్లు. టన్నెల్‌ పనుల్లో రూ.58 కోట్లు ఆదా చేశామన్నారు. 

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని ఈ భేటీలో సీఎం ప్రస్తావించారు. కృష్ణానదిలో గడిచిన 52 ఏళ్లలో నీటి లభ్యత సగటున ఏడాదికి 1230 టీఎంసీల నుంచి 456 టీఎంపీలకు పడిపోయిందని, మరోవైపు గోదావరిలో గడిచిన 30 ఏళ్లలో సగటున ఏడాదికి 2780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయన్న వివరించారు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణా డెల్టా సహా.. తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలానికి తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమిత్‌షాను కోరారు. 

Read Also: మహిళలకు అండగా ‘సఖి వన్‌స్టాప్‌’

తాజా వీడియోలు

Back to Top