పల్నాడు: వచ్చే ఎన్నికల్లో వంద శాతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయం సాధిస్తారని, మాకు ఉన్న ధైర్యం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ప్రజలకు ప్రజలకు మంచి చేశారు కాబట్టి మళ్లీ మా పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 5 వేలు మెజారిటీతో గెలుస్తామన్న మా పార్టీ ఎమ్మెల్యే 20 వేల మెజారిటీతో, 20 వేలు మెజారిటీ తో గెలుస్తామనుకునే వాళ్లు 50 వేల మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణం 10 వ వార్డు గుర్రాలచావిడి లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజినితో కలిసి బైరెడ్డి సిద్దార్దరెడ్డి ఇంటింటా పర్యటించారు. ఈ మూడున్నరేళ్లలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆయన ప్రచారం చేశారు. అనతికాలంలోనే వైయస్ జగన్ 98 శాతం హామీలు అమలు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచారని ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ప్రజల దగ్గరకు వెళ్లే వారు ధైర్యంగా, గర్వంగా వెళ్లాలి. ఆ స్థాయిలో సీఎం వైయస్ జగన్ మమ్మల్ని నిలబెట్టారన్నారు. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల కరపత్రం చూపిస్తే ఆ రోజు ప్రతిపక్షాలు.. చెబుతారు కానీ అమలు చేస్తారా అని హేళనగా మాట్లాడారు. నవరత్నాలు అమలు చేయాలంటే బ్యాంకులు దివాళ తీయాల్సిందే అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడున్నరేళ్లలో 98 శాతం హామీలు నెరవేర్చారు. ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లి నవరత్నాలు, సంక్షేమ పథకాలు అందాయంటే.. ప్రజలంతా సంతోషంగా అందాయని చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు కేవలం సినిమాల్లోనే చూశాం. ఇవాళ రాష్ట్రంలో నిజజీవితంలో వైయస్ జగన్ సాధ్యం చేసి చూపించారు. ఇవన్నీ సాధ్యం చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మా గౌరవాన్ని సీఎం వైయస్ జగన్ పెంచారు. ఏ నాయకుడైనా ప్రజల వద్దకు ఓటు అడిగేందుకు ధైర్యంగా, గర్వంగా వెళ్లాలి. ఆ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టినందుకు ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ రుణంతీర్చుకోలేం. ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లినప్పుడు అధికారులంతా వారి వెంట వస్తున్నారు. గతంలో ప్రజలు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు అయ్యేవి కావు. ఇవాళ అధికారులే ఇళ్ల ముందు వచ్చి నిలబడుతున్నారు. దటీజ్ వైయస్ జగన్ అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గర్వంగా చెప్పారు.