వార‌సుల‌ను వాడుకోవ‌డంలో బాబు త‌ర్వాతే...

సెంటిమెంటును వాడుకోవ‌డం, త‌ర్వాత‌ చెరుకు పిప్పిలా అవ‌త‌ల ప‌డేయ‌టం చంద్ర‌బాబుకు వెన్న‌తోపెట్టిన విద్య‌. కిడారి కిర‌ణ్ ప‌రిస్థితి కూడా బాబు వాడుకున్న చెరుకు ముక్క‌లాగే అయ్యింది. మావోల‌ చేతిలో హతం అయ్యిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేస్వ‌ర‌రావు కొడుకు కిడారి శ్రావ‌ణ్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నాడు చంద్ర‌బాబు. అదీ ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఆరునెల‌ల స‌మ‌యం ఉంద‌న‌గా ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాడు. ఆరు నెల‌ల్లోపు శాస‌న స‌భ లేదా మండ‌లిలో ఎన్నిక కాక‌పోతే అత‌డి మంత్రి ప‌ద‌వి మురిగిపోతుంది. ఆరు నెల‌ల్లోపే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో శ్రావ‌ణ్ కు ఈ ప‌దవి ఇచ్చి ప్ర‌యోజ‌నం ఏముంటుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నించినా చంద్ర‌బాబు లెక్క‌పెట్ట‌లేదు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో గిరిజ‌న సంక్షేమ శాఖా మంత్రిగా శ్రావ‌ణ్ ను కేబినెట్ లోకి తీసుకున్నాడు. మే 10వ తేదీతో ఆ గ‌డువు ముగిసిపోయింది.

ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సి గెలిచి ప‌ద‌వి కాపాడుకునే అవ‌కాశం శ్రావ‌ణ్ కు లేకుండా పోయింది. గ‌వ‌ర్న‌ర్ నుంచి రాజీనామా చేయ‌మ‌నే ఉత్వ‌ర్వులు కూడా యువ‌మంత్రికి అందాయి. అయితే ఈ ఆరు నెల‌ల స‌మ‌యంలోనైనా శ్రావ‌ణ్ కుమార్ ఎలాంటి ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలూ చేప‌ట్ట‌లేదు. పైగా జ‌ల్సాలు,జ‌ర్నీల‌తో పార్టీలు చేసుకున్నాడ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎలాంటి అనుభ‌వం లేని, క‌నీసం చ‌ట్ట స‌భ‌ల్లో గెలిచి ప‌ద‌వి కాపాడుకునే అవ‌కాశం లేని మంత్రిగిరీ ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు ఉద్దేశ్యం ఏమిటో స్పంష్టంగానే తెలుసుకోవ‌చ్చు. పేరుకు గిరిజ‌న ఎమ్మెల్యే మ‌ర‌ణంపై సానుభూతి పొంద‌డం, ఆయ‌న కుమారుడికి ప‌ద‌వి ఇచ్చాన‌నే పేరు పొంద‌డం బాబు ఉద్దేశ్యం. ఈ విధంగా గిరిజ‌న ఓట్ల‌కు గాలం వేయాల‌ని ప్ర‌య‌త్నం చేసాడు. ఇక శ్రావ‌ణ్ కుమార్ రాజీనామా గురించి చంద్ర‌బాబును సంప్ర‌దిస్తాను అని పైకి అన్నా చివ‌ర‌కు వెళ్లి నారా లోకేష్ తో స‌మావేశం అయ్యాడు. పార్టీ ప‌గ్గాల‌న్నీ చిన బాబు చేతుల్లో ఉన్నాయి అనే విధంగా బిల్డ‌ప్ ఇవ్వ‌డం కోస‌మే ఈ చ‌ర్య‌లు అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ఈ పిన్న‌వ‌య‌సు పిన్న కాల‌పు ప‌ద‌వికి రాజీనామాని చంద్ర‌బాబుకు స‌మ‌ర్పించేసార‌ని, సీఎమ్ దాన్ని గ‌వ‌ర్న‌రుకు స‌మ‌ర్పించేయ‌డ‌మే త‌రువాయ‌ని అంటున్నారు.

మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో అర‌కు నుంచి కిడారి శ్రావ‌ణ్ కుమార్ తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బాబు ప్ర‌లోభాల‌కు లోనై టీడీపీలోకి చేరిన శ్రావ‌ణ్ తండ్రి కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు అధికార పార్టీ అండ‌తో అడ్డ‌గ‌లోలు దోపిడీకి పాల్ప‌డ్డారు. అక్ర‌మ మైనింగ్ లు జ‌రిపారు. దీంతో మావోలు ప‌లుమార్లు ఆయ‌న‌కు హెచ్చ‌రిక‌లు కూడా పంపారు. ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌లు మానుకోవాల‌ని చెప్పినా కిడారి విన‌క‌పోవ‌డంతో వారు ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మ‌రో మాజీ ఎమ్మెల్యేతో క‌లిపి వీరిని హ‌త‌మార్చారు మావోలు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తూ పార్టీ ఫిరాయించ‌డ‌మే కాకుండా, గిరిజ‌న మండ‌లి ఏర్పాటును కూడా ప‌ట్టించుకోకుండా, అట‌వీ సంప‌ద‌ను దోచుకున్నాడ‌న్న పేరు ప‌డ్డ కిడారి కుటుంబంపై గిరిజనులు సానుభూతి చూపుతారా అన్న‌ది అనుమానాస్ప‌ద‌మే! ఈ ప్ర‌తికూల‌త‌ల్లో శ్రావ‌ణ్ గెలుపు పై కూడా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అటు శాస‌న స‌భ్యుడిగానూ గెలువ‌క‌, ఇటు మంత్రిప‌ద‌వి ముందే పోయి శ్రావ‌ణ్ రెంటికీ చెడ్డ రేవ‌డి అవుతాడంటున్నారు గిరిజ‌న నేత‌లు. బాబు అవ‌స‌రానికి శ్రావ‌ణ్ పావుగా బ‌ల‌య్యాడ‌ని అంటున్నారు.

నంద‌మూరి కుటుంబానికీ ఇదే త‌ర‌హా మోసం

తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప‌ద‌వులిచ్చి ప‌బ్బం గ‌డుపుకోవ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌. ఒక‌ప్పుడు నంద‌మూరి హ‌రికృష్ణ‌ను కూడా ఇలాగే మోసం చేసాడు చంద్ర‌బాబు. వెన్నుపోటు పొడిచి ఎన్టీరామారావును గ‌ద్దె దించిన‌ప్పుడు ఆయ‌న కుటుంబాన్ని అడ్డుపెట్టుకున్నాడు.   

నంద‌మూరి అభిమానుల‌కు కోపం రాకుండా హ‌రికృష్ణ‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన‌ట్టు నాటకం ఆడాడు. ర‌వాణా శాఖా మంత్రిగా ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినా ఆరు నెల‌ల‌లోపు చ‌ట్ట‌స‌భ‌ల్లో పోటీ చేయ‌నీయ‌లేదు. దాంతో హ‌రికృష్ణ త‌న స్థానాన్ని పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. 

ఇక బాల‌కృష్ణ‌ను ఎప్పుడో దూరం పెట్టిన బాబు, తాను అధికారానికి ప‌దేళ్లు దూరం అవ్వ‌డంతో వెంట‌నే నంద‌మూరి\ ఫ్యామిలీతో మ‌ళ్లీ బందం క‌లుపుకున్నాడు. బాల‌కృష్ణ కూతురు బ్రాహ్మ‌ణిని కొడుకు లోకేష్ కిచ్చి వివాహం చేసి మ‌రోసారి నంద‌మూరి సెంటిమెంటును తెర‌పైకి తెచ్చాడు. వియ్య‌కుండికి హిందూపూర్ నుంచి అవ‌కాశం క‌ల్పించాడు. అభిమానానికి కంచుకోట క‌నుక అక్క‌డ బాల‌య్య‌కు సులువుగా గెలుపు వ‌రించింది. అభిమానుల‌ను, సొంత కార్య‌క‌ర్త‌ల‌ను, నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌నూ కొడుతూ, బూతులు తిడుతూ, మందు పాట‌లు పాడుకుంటూ సినిమాలు చేసిన బాల‌కృష్ణ 5 ఏళ్లుగా ఆ ప్రాంతానికి ఏమీ ఒర‌గ‌బెట్ట‌లేదు. దీనిపై అసంతృప్తిగా ఉన్న హిందూపూర్ వాసులు ఈ సారి బాల‌య్య‌కు జైకొట్ట‌డం క‌ష్ట‌మే అని స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ విధంగా నంద‌మూరి వార‌సులు రాజ‌కీయాల‌కు ఇక దూర‌మైపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

ఇలా చంద్ర‌బాబు త‌న అవ‌కాశ వాద రాజ‌కీయాల కోసం ఎంద‌రో వార‌సుల‌ను వాడుకుని వ‌దిలేసాడు. వారి రాజ‌కీయ జీవితాల‌కు స‌మాధి క‌ట్టేసాడు.  

Back to Top