జగన్‌ ప్రశ్నలకు బదులేదీ బాబూ..?



– అవిశ్వాసానికి వెళ్దామన్నా స్పందన కరువు
– టీడీపీ పెడతామన్నా మద్ధతు ఇస్తామన్న జగన్‌
– నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారంటూనే ఎన్‌డీఏలోనే ఉంటామంటూ ముక్తాయింపు 
– మళ్లీ అదే రెండు కళ్ల సిద్ధాంతంతో మోసం
– చంద్రబాబు విరుద్ధ ప్రకటనలతో నష్టపోతున్న ఏపీ 

ప్రత్యేక హోదా ఉద్యమం చివరి అంకానికి చేరుకుంది. పార్టీల బలాబలాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అందరూ ఒక్కటవ్వాలని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా ఉద్యమం చేస్తున్నామని.. ఇప్పటికైనా ప్రభుత్వం తమతో కలిసి రావాలని ప్రభుత్వాన్ని కోరారు. భేషజాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నట్టు గతంలోనే ప్రకటించిన వైయస్‌ జగన్‌... కేంద్రం నుంచి వైదొలుగుతామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మరోసారి మార్చి 21న అవిశ్వాసం పెడుతున్నామని తమతో కలిసి రావాలని చంద్రబాబును కోరారు. అలా కాదన్నా.. అంతకన్నా ముందే టీడీపీ అవిశ్వాసం పెడతామన్నా అందుకు తాము మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జగన్‌ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ టీడీపీ నుంచి ఎలాంటి స్పందన కనపడకపోవడం.. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే విషయాన్ని చెబుతోంది. ప్రత్యేక హోదా ఇస్తామంటే కాంగ్రెస్‌కైనా మద్ధతు ప్రకటించడానికి వెనకాడబోమని.. ప్రభుత్వం ఏదైనా అంతిమంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే తన ఎన్నికల ఎజెండా అని వైయస్‌ జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. 
ఇంకా వేచి చూసే ధోరణి..
ప్రతి బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయం జరుగుతున్నా నోరెత్తని చంద్రబాబు.. ఎన్నికల ముందయినా కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడం మంచిదే అయినా.. ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పినప్పటికీ తిరుగుబాటు చేయాల్సింది పోయి వేచి చూసే ధోరణిలో ఉండటం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుంది. గతంలోనూ రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచి విభజనకు కారకుడైన చంద్రబాబు.. ఇప్పుడూ మరోసారి అదే పంథాను కొనసాగిస్తున్నారు. కేంద్రం నుంచి వైదొలుగుతున్నామని చెప్పి.. ఎన్‌డీఏ భాగస్వామిగానే ఉంటామని చెప్పడం అందర్నీ నివ్వెరపరిచే విషయమే. అనుకూల మీడియాలో బీజేపీ వ్యతిరేక వార్తలు రాయిస్తూనే.. మోడీ తనతో మాట్లాడినట్టు, వేచి చూడాలని సూచించినట్టు రాయించుకోవడం సిగ్గు చేటయిన అంశం. 
ఇదంతా ఎందుకంటే..
ఒకేసారి కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే తమ పార్టీకి జరిగే నష్టాన్ని అంచనా వేసిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణాన్ని బీజేపీ నెట్టడానికి తెలుగు ప్రజలను ప్రిపేర్‌ చేసే పనిలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. తానోపక్క పోరాడుతున్నట్టు.. కేంద్రం ఒప్పుకోవడం లేదని కొన్నాళ్లు ప్రచారం చే యడం ఆయన తక్షణ కర్తవ్యం. అనుకూల మీడియా ఆ పనిలో ఉంటుంది. తెలుగు ప్రజల్లో కొంత సానుభూతిని సంపాదించుకుని.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతారు. చేయాల్సిందంతా చేశాం.. కేంద్రమే మోసం చేసిందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొడతారు. ఇదీ స్కెచ్‌. దాంతోపాటు కర్నాటక ఎన్నికలు కూడా ఉండటంతో అక్కడ ఫలితాలను బట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగా విడతలవారీగా కేంద్రంతో దూరం జరుగుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఏమైనా తేడా వస్తే కాంగ్రెస్‌తో జట్టు కట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుండటం కొసమెరుపు. అందులో భాగంగానే చంద్రబాబు తరఫున టీడీపీ నాయకులు ఈనెల 13న సోనియా గాంధీ ఇచ్చే విందుకు హాజరవుతారని మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Back to Top