హైదరాబాద్) దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల్ని పరామర్శిస్తూ సాగిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ముగిసింది. దాదాపుగా రాష్ట్రమంతా సాగిన ఈ యాత్ర నిజామాబాద్ లో పూర్తయింది.ప్రజలను జన రంజకంగా పరిపాలించిన దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ కూలిపోవటంతో మరణించారు. ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్ మెంట్, రుణ మాపీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్; జలయజ్నం, వంటి పథకాలతో ఆయన ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకొన్నారు. రాజన్న మరణ వార్త తో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందల మంది అభిమానులు ప్రాణాలు వదిలారు.ఇటువంటి వారిని ఆదరించటం తమ ప్రాథమిక కర్తవ్యంగా భావించిన దివంగత వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ..చనిపోయినవారి కుటుంబాల్ని పరామర్శించేందుకు యాత్రకు శ్రీకారం చుట్టారు. నల్ల కాలువ ప్రాంతం నుంచి ఒక ప్రకటన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆయా కుటుంబాల సభ్యుల్ని కలుస్తానని మాట ఇచ్చారు. ఈ మాట మేరకు కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో యాత్ర ను పూర్తి చేశారు. తర్వాత ఆయన సూచన మేరకు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర ప్రారంభించారు. డిసెంబర్ 8, 2014 న ప్రారంభించి తొమ్మిది జిల్లాల్లోని 7,718 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 55 రోజుల పాటు పర్యటించి 310 కుటుంబాల్ని ఆమె పరామర్శించారు. అభిమానంతో ఆదరించిన వారందరికీ అండగా ఉంటామని ఆమె వివరించారు. చివరగా నిజామాబాద్ జిల్లాలోని గాంధారి మండలం పోతంగల్ గ్రామంలో పరామర్శ యాత్ర ముగించి అక్కడ స్మారక స్తూపం ఏర్పాటుకి సంకల్పించారు. పరామర్శ యాత్ర కు సహకరించిన వారందరికీ పేరు పేరునా ఆమె ధన్యవాదాలు తెలిపారు.