బెడిసికొట్టిన చీప్‌ పబ్లిసిటీ

– బాబుపై జనాగ్రహం
– సహాయం అందటం లేదంటూ బాధితుల నిలదీత 
– లోకేష్‌ ట్వీట్లపై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు

అటుకులు బొక్కే నోరు.. ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.. లోకేష్‌ అసందర్భంగా చేసే విమర్శకులకు హద్దులేకుండా పోతోంది. మంచీ చెడూ.. అనచ్చా అనకూడదా అనే సందర్భం మరిచి నారా లోకేష్‌ పైత్యానికి పదును పెడుతున్నాడు. రాసుకోవడానికి ట్విట్టర్‌ ఉంది కదా అని పొద్దున లేచించి మొదలు పొద్దుగుంకే దాకా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంటున్నాడు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు తిత్లీ ధాటికి సర్వస్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆదుకోవాల్సింది పోయి .. రాజకీయం కోసం వాడుకోవాలనుకోవడం ఇప్పుడు నివ్వెరపరుస్తోంది. ఒడిశా తుపానుకు సాయం చేశాం.. హుద్‌ హుద్‌ వచ్చినప్పుడు విశాఖ నగరాన్ని పునర్‌నిర్మించాం అని చెప్పుకునే చంద్రబాబు, తండ్రి వేగం, తెలివితేటల గురించి డప్పేసుకునే లోకేష్‌లు ప్రకృతి విళయం తాండవంతో సర్వం కోల్పోయినవారికి అండగా నిలవడం మాని రాజకీయ విమర్శలు చేస్తుండటం బాధాకరం. ఒకపక్క తమ పార్టీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. పార్టీలకతీతంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు బాధితులకు అందిస్తున్న సహాయంపై కృతజ్ఞతలు తెలుతుంటే మరింత ప్రోత్సహించాల్సిందిపోయి చెడగొడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కనీసం తాగడానికి నీళ్లు లేవు.. తినడానికి తిండి లేదు.. పిల్లలకు పాలు లేవు ఆదుకోండయ్యా అని జనం భీతిల్లుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. బాధితులకే కాదు.. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వేర్వేరు ప్రతికల జర్నలిస్టులు సైతం అధికారుల జాడే కనిపించడం లేదంటూ సహాయక చర్యలపై పెదవి విరిచారు. ప్రభుత్వం చెప్పుకుంటున్న సాయం కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. సహాయ ప్రాంతాల్లో పర్యటించే అరకొర అధికారులు కూడా దారితెన్నూ కానరాక ఎక్కడో ఒకచోట స్థాయిగా కూర్చుని వెనక్కి వచ్చేస్తున్నారని.. బాధితులకు సాయం అందించలేకపోతున్నారని వివరించడం డ్యాష్‌ బోర్డు సీఎం దృష్టికి రాకపోవడం శోఛనీయం. నిరంతరం ఇంటెలిజెన్సు సహకారంతో పాలన సాగించే హైటెక్‌ ముఖ్యమంత్రికి ఆ మాత్రం తెలియకపోవడం నమ్మశక్యం కావడం లేదు. 

ఇదంతా ఒక ఎత్తయితే చివరికి బాధితులు చంద్రబాబును నిలదీసిన వైనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నడుముల లోతు నీళ్లలో చంద్రబాబు బోటు పర్యటన చేయడం విమర్శలపాలైంది. బాధితులకు పార్టీ అండగా ఉంటోందని.. చంద్రబాబు చాలా బాగా పనిచేశారని మీడియాలో చెప్పుకునేందుకు పార్టీ కార్యకర్తలకు ప్ల కార్డులు చేతబట్టించి ‘వరదల నుంచి కాపాడిన చంద్రబాబుకు ధన్యవాదాలు’ స్టంట్‌ బెడిసి కొట్టింది. చంద్రబాబు ఓవరాక్షన్‌ చూసి జనం చీదరించుకున్నారు. బాబు స్వయంగా శ్రీకాకుళం వచ్చినప్పుడు బాధితులు ఆయన్ను నిలదీయడంతో కళ్లు బైర్లగమ్మాయి. మీకు సహాయ చర్యలు అందుతున్నాయా, నీరు, ఆహారం సరఫరా జరుగుతోందా అని చంద్రబాబు బాధతులను ప్రశ్నించినప్పుడు బాధితుల నుంచి ఎదురైన ‘లేదు’ అనే మాటతో బాబు నోరు మూగబోయింది. ఏం చేయాలో అర్థంకాక సహాయం కోసం అర్థించిన ప్రజలపై నోరు పారేసుకున్నాడు. అడ్డుకుంటే బుల్డోజర్‌తో తొక్కిస్తానని జనాగ్రహానికి గురయ్యాడు. ఎల్లో మీడియా దీనిని ప్రచురించకపోయినా.. సోషల్‌ మీడియాలో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి చంద్రబాబును చీవాట్లు పెట్టారు. 

ఇదంతా ఒక ఎత్తయితే జనం నివ్వెరపోయేలా చంద్రబాబు చేసిన ప్రకటనలు హాస్యాస్పదం అయ్యాయి. ప్రకృతిని కంట్రోల్‌ చేశా.. సముద్రాన్ని హ్యాండిల్‌ చేస్తా.., తుపాన్‌ ర హిత నగరంగా విశాఖ వంటి ప్రకటనలతో నవ్వులు పాలయ్యాడు. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన బాధితులకు అండగా నిలవాల్సింది పోయి.. పబ్లిసిటీకి వాడుకోవడం దురదృష్టకరం. పైగా ఆ పాపాన్ని ప్రతిపక్ష నాయకుడి మీదకు నెట్టి తప్పించుకోవాలనుకోవడం క్షమార్హం కాదు. 

టీడీపీ ఎంపీకి చేదు అనుభవం

 

 తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చిన పనిపూర్తవకుండానే ఎంపీ వెనుదిరగాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం పనగానిపుట్టుగ గ్రామంలోని తుఫాను బాధితులను పరామర్శింటానికి వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని, నీళ్లు ఇతర అవసరాలను తీర్చిందని చెబుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు.

తమకు ఎలాంటి సహాయం అందలేదని, విద్యుత్‌ సౌకర్యం ఇప్పటివరకు పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట అంచాన వేయటానికి ఏ ఒక్క అధికారి కూడా ఊరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారిని నిలదీశారు. దీంతో ఆయన అక్కడి వెళ్లిపోయారు.


Back to Top