సుజనాకోసం కొత్త చట్టం కావాలి


ఈడీ విచారణ ఎదుర్కుంటున్న టిడిపి ఎంపీ సుజనాచౌదరి తనకంటూ ప్రత్యేకమైన చట్టం ఉండాలంటున్నారు. బ్యాంకుల అప్పులు మిగిలివారు చెల్లించకపోతే వారిని ఎగవేత దారులు అనొచ్చట. కానీ సుజనా చౌదరి విషయంలో అలా అనకూడదంటున్నారు. బాంకులన్నాక అప్పులివ్వవా? ఇస్తే మాలాంటి వాళ్లు ఎగ్గొట్టరా? ఈమాత్రానికే తప్పు పడతారా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు ఎంపీ సుజన. నష్టాల్లో నడిచే కంపెనీలను దివాలా తీసాయని అనకూడదట. సుజనా చట్టం ప్రకారం నష్టాల్లో సాగే కంపెనీలను అద్భుతంగా నడుస్తున్నాయని కితాబివ్వాలి కాబోలు. సెబీతో సహా ఏ ఆడిట్ లోనూ కంపెనీలో అవకతవకలు ఉన్నట్టు బయటపడలేదుట. కానీ ఇప్పుడు బయటపడితే చట్టపరంగా ఎదుర్కుంటానని చెప్పుకుంటున్నాడు. జగన్ విషయంలో ఈడీ దాడులు జరగడం అవినీతి కేసట. తన కేసు మాత్రం అలాంటిది కాదట. ఈడీ అధికారులు పొరపాటున అక్రమాలు జరిగాయని ఆయనకు క్షమాపణలు చెప్పుకున్నార్ట.
కోటానుకోట్ల ఎగవేత
కార్పొరేట్ బాంకు నుంచి 159 కోట్లు, ఆంధ్రా బాంకు నుంచి 71 కోట్లు,  సెంట్రల్ బ్యాంకు నుంచి 133 కోట్లు రుణం తీసుకుని మోసగించినట్టు సుజనా చౌదరిపై ఈ బ్యాంకులు ఫిర్యాదు చేసాయి. రుణ ఎగవేత పై ఇప్పటికే 3 కేసులు నమోదై ఉన్నా ఇంతవరకూ సుజనాపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 
బ్యాంకులను ముంచిన చరిత్ర
30ఏళ్లుగా నేను వ్యాపారం చేస్తున్నా అని చెప్పుకుంటున్న సుజనా చౌదరి బాంకులను ముంచిన చరిత్ర గురించి కూడా చెప్పుకుంటే బావుండేది. ఆయన చెప్పనంత మాత్రాన నిజాలు నిప్పుల్లో కాలి పోవు. హవాలా కేసులతో పాటు బాంకులనకు టోపీ వేసిన సంగతులన్నీ కథలు కథలుగా దేశ వ్యాప్తంగా చెప్పుకున్నారు. అందులోనూ మలేసియన్ బాంకుకు టోకరా వేస్తే ఆ వ్యవహారం హైదారాబద్ లో హైకోర్టు దాకా వచ్చింది. అప్పటికే సుజనా చౌదరి బాబుకు ఆంతరంగికుడైపోయి, ఎంపీగా మారి తమ భాగస్వామ్య బిజేపీలో మంత్రిగా ఉండటంతో మేనేజ్ చేసుకోవడంలో ఇవన్నీ పనికొచ్చాయి. నిజానికి 2009 నుంచి సుజనా వ్యాపారాలు చేయడమే కాదు, అప్పటికి కష్టకాలంలో ఉన్న చంద్రబాబుకు, అధికారంలేని టిడిపికీ చాలా అండదండలే అందించాడు. 
బోగస్ కంపెనీలు
సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకులకు చేసిన ఫ్రాడ్ విలువ 6000 కోట్లు అని ట్విట్టర్ లో ఈడీ పోస్టు చేసింది. 120దాకా షెల్ కంపెనీల గుట్టు రట్టైందని, అవన్నీ సుజాకు చెందినవే అని ఈడీ ట్వీట్ చేసింది.  ఈ కంపెనీలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుండటం ఒక విశేషం. ఈడీ సోదాల్లో ఈ కంపెనీల పేరుమీద రబ్బరు స్టాంపులు కూడా లభించాయని, ఈ కంపెనీలతో సుజనా చౌదరి లావాదేవీలకు సంబంధించిన ఈమెయిల్స్ ను కూడా గుర్తించారని తెలుస్తోంది. విచారణ కోసం సుజనా చౌదరిని ఈనెల 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 
ఈడీని కూడా రావద్దంటారా
సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ ను కూడా ఎపిలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ జీవో జారీ చేస్తుందా లేక అది వేరు ఇది వేరు అంటూ తప్పించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 
 
Back to Top