హైదరాబాద్: బలహీనవర్గాలను అన్ని విధాలుగా కించపరిచిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి బీసీ అధ్యయన కమిటీని సంవత్సరన్నర క్రితం ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి బీసీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని నివేదిక తయారు చేశామన్నారు. బీసీల స్థితిగతులపై రూపొందించిన నివేదికను లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు వైయస్ జగన్ అందజేశామని, అందులోని అంశాలపై వైయస్ జగన్ క్షుణ్ణంగా కమిటీతో చర్చించారన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించడం జరుగుతుంది. త్వరలోనే సభా ప్రాంతాన్ని ప్రకటిస్తామన్నారు. వైయస్ జగన్ గెలుపు అనివార్యమని ప్రతి నోటా వచ్చే మాట ఇది. విజయానికి బీసీలు కూడా భాగస్వామ్యం కావాలి. వంచన చేసిన చంద్రబాబు నైజాన్ని అన్ని చోట్ల ఎండగట్టాలన్నారు. 19వ తేదీన జరగబోయే గర్జనను విజయవంతం చేయాలని కోరారు. వైయస్ జగన్తో భేటీ అనంతరం పార్టీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. బీసీలను సర్వనాశనం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని జయహో బీసీ సభ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించి రాష్ట్రంలోని 25 కుల సంఘాలు, సంచార జాతులను కలవడం జరిగిందని, వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉందంటే. కొన్ని ప్రాంతాల్లో మా కులం ఏంటని కమిటీ సభ్యులను అడిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సంచార జాతులకు కులం పేరు తెలియని పరిస్థితి ఉంది. జయహో బీసీ కార్యక్రమంలో బీసీలంతా మావైపే ఉన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని, బీసీలకు ఏం ఒరగబెట్టారని బీసీలు మీ వైపు ఉంటారని ప్రశ్నించారు. అవసరానికి తగినట్లు మాట్లాడే నీచమైన మనిషి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన అంశాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. సంవత్సరం నాలుగు నెలల పాటు ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేసిన వైయస్ జగన్ ప్రజలందరి బాధలు తెలుసుకున్నారన్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని వారికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలను ప్రకటించారన్నారు. నాలుగున్నరేళ్లు ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నాయని నవరత్నాలను కాపీ కొడుతున్నారన్నారు. కొత్త సీసాలో పాత సారాయి అనే విధంగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఏ హామీలు ఇచ్చారో.. మళ్లీ మోసం చేయడానికి అవే ఇస్తున్నారన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు అని జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. జస్టిస్ ఈశ్వరయ్య ఏం చెప్పారో ప్రజలంతా చూశారన్నారు. బీసీలకు వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉండదు అని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు కాకుండా మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు బీసీలను అవమానించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. న్యాయం చేయాలని వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారులను తాట తీస్తానని మాట్లాడారన్నారు. అదే విధంగా ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని నీచంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. వైయస్ జగన్ ప్రతి కులానికి కార్పొరేషన్ అని ప్రకటించగానే.. దాన్ని కాపీ కొట్టి చంద్రబాబు కూడా ప్రకటిస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా కులాలు, మతాలు, రాజకీయాలకు తావు లేకుండా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా వైయస్ జగన్ కృషి చేస్తారన్నారు. బీసీలకు సంబంధించిన బాధలు, ఆర్థిక పరంగా, సామాజిక రుగ్మతలు ఏమున్నాయి. రాజకీయంగా ఇవ్వాల్సిన అవకాశాలు, ఏ ప్రాంతంలో కుల వృత్తులు నిర్వీర్యం అవుతున్నాయో వైయస్ జగన్కు బీసీ అధ్యయన కమిటీ వివరించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన బీసీ గర్జన సభ జరిపేందుకు నిర్ణయించామన్నారు. గర్జన సభలో బీసీల కోసం చేపట్టబోయే కార్యక్రమాలను వైయస్ జగన్ వివరిస్తారన్నారు.