వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ లేఖ‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు...
బహిరంగ లేఖ
‘‘ఈడీ కేసులో నిందితురాలిగా వైయస్‌ భారతి’’ అంటూ ఈనాడులో, ‘‘ముద్దాయిగా భారతి’’ అంటూ ఆంధ్రజ్యోతిలో ఈ రోజు ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్త శ్రీమతి భారతి, నేను ఈ రోజు ఉదయం ఎల్లో పత్రికలు, సెలెక్టివ్‌గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్త చూసి తెలుసుకోవాల్సివచ్చింది.
– జడ్జీగారు పరిగణనలోకి తీసుకున్న తరవాతే చార్జిషీట్‌లో ఏముంది అన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జీగారు పరిగణనలోకి తీసుకోక ముందే... మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? నా మీదే కాకుండా మొత్తంగా నా కుటుంబ సభ్యుల్ని టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉంది? సీబీఐ తన విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తుల్ని ఇన్నేళ్ల తరవాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు? అసలు శ్రీమతి భారతికి ఈ కేసులతో సంబంధం ఏమిటి? ప్రతి ఒక్కరూ ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ, కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

– నామీద తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీ కలిసి వేసిన కేసులు 2011 ఆగస్టు 10న ప్రారంభం అయితే ఈ రోజు 2018 ఆగస్టు 10. కేసు ప్రారంభమై ఏడేళ్లు గడచిపోయింది. ఎన్నో చార్జిషీట్లు వేశారు. అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహానేత మరణం తరవాత, మాటకు కట్టుబడి ఓదార్పు చేస్తానన్నందుకు, పెద్దయెత్తున ప్రజాదరణ దక్కుతున్నందుకు తెలుగుదేశం–కాంగ్రెస్‌ కుమ్మక్కుఅయి నా మీద కేసులు వేశాయి. ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా ఏనాడూ భయపడలేదు... సత్యమేవ జయతే అని నమ్మాను
కనుకే అన్నింటినీ భరిస్తున్నాను. ఈ రోజు ఎల్లో మీడియా వార్తల్ని బట్టి చూస్తే, శ్రీమతి భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్లో మీడియా సంబరపడుతోంది.  

– ఇంతకు ముందునుంచి జరుగుతున్న కొన్ని విషయాలను క్లుప్తంగా చెప్పాలి. ఈడీలో చంద్రబాబు కోసం, చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులు– ఉమాశంకర్‌ గౌడ్, గాంధీ... ఈ ఇద్దరూ మమ్మల్ని ఏ స్థాయిలో వేధిస్తున్నారో 2017 ఫిబ్రవరిలో, అంటే దాదాపు 17 నెలల క్రితం భారత ప్రధానిగారికి లేఖ ద్వారా తెలియజేశాం. ఆ అధికారుల కాల్‌ డేటా మీద దర్యాప్తు చేసినా, వారికి చంద్రబాబుగారి సహచరులతో ఉన్న సంబంధాల మీద దర్యాప్తు చేసినా... ఆ ఇద్దరూ నా మీద, నా కుటుంబం మీద చంద్రబాబు ప్రయోగించిన ప్రత్యేక ఆయుధాలన్న విషయం రూఢి అవుతుంది. ఇందులో గాంధీ అనే అధికారి బదిలీ అయినా, ఉద్యోగం నుంచి రిలీవ్ కాకుండా అసాధారణంగా ఆయన మూడు సార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఈ పొడిగింపును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఇప్పుడు ఆ అధికారుల చేతే టీడీపీ వారు మామీద కక్ష సాధింపు రిపోర్టుల్ని రాయించారని స్పష్టమవుతోంది.

–ఇవన్నీ గమనించిన తరవాత... బీజేపీతో కుమ్మక్కు అయింది ఎవరు? బీజేపీ–టీడీపీల చీకటి వ్యవహారాల్లో బాధితులెవరు అన్నది రాష్ట్ర ప్రజలకు మరింతగా స్పష్టమవుతుంది. చంద్రబాబుగారు బురద చల్లుతున్నదానిలో వాస్తవమే ఉంటే, అంటే బీజేపీకీ మాకూ అంత సత్సంబంధాలే ఉంటే, ఈ విషయం ఇంత దూరం వచ్చేదా? అసలు ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్యను కూడా కక్ష పూరితంగా– అదీ ఏడేళ్ల తరవాత ఈడీవారు చార్జిషీట్‌లో పెట్టి ఉండేవారా? పగలు కాంగ్రెస్‌తో కాపురం... రాత్రికి బీజేపీతో సంసారం... ఇదీ ఇప్పుడు
చంద్రబాబు నడుపుతున్న రాజకీయం! ఈ తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా, నామీద కేసుల విషయంలో భయపడకుండా, రాజీపడకుండా... సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పోరాటం నుంచి ప్రత్యేక హోదా పోరాటం వరకు ధైర్యంగా రాష్ట్ర సమస్యలమీద ఉద్యమించాం తప్ప కాడి అవతల పారేయలేదు... లాలూచీ ఆలోచనలు చేయలేదు. తెర వెనుక రాజకీయాలు చేతగావు. మరోవంక, లాలూచీ రాజకీయాలకు పెట్టినది పేరు అయిన చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని చూడండి...‘‘చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నా మా మిత్రుడే’’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ మంత్రిగారి భర్త చంద్రబాబు కొలువులో సభ్యుడు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య మన టీటీడీ బోర్డులో
చంద్రబాబు నియమించుకున్న సభ్యురాలు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ జరుగుతుంటే, బాలకృష్ణ పక్కనే కుర్చీలో కూర్చుని సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు కనిపిస్తారు.   

–బీజేపీతో బంధాలు, సంబంధాలు అలాగే ఉన్నాయి కాబట్టే, ఓటుకు కోట్లిస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయినా, సుప్రీం కోర్టు సమన్లున్నా, దేశంలో నంబర్‌ వన్‌ అవినీతి ప్రభుత్వాధిపతి ఆయనే అని ఎన్నిసంస్థలు చెపుతున్నా... ఈ పెద్దమనిషి రొమ్ము విరుచుకుని తిరగగలుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌), సెంటర్‌ ఫర్ మీడియా స్టడీస్‌(సీఎంఎస్‌), ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు తమ నివేదికల్లో బయటపెట్టాయి.ఇక కాగ్‌ నివేదికల్లో చంద్రబాబు కొండంత అవినీతి సంగతులు అన్నీ కాకపోయినా, కొన్ని అయినా ప్రస్తావనకు వచ్చాయి. ఇవన్నీ విచారణ జరగాల్సిన అంశాలే. అయినా ఇందులో ఏ ఒక్క అంశం మీదా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరవాత కూడా బాబుమీద విచారణ జరగటం లేదంటే... చంద్రబాబు రెండు జాతీయ పార్టీల్నీపగలూ రాత్రీ పద్ధతిలో ఎంతగా మేనేజ్‌ చేస్తున్నాడో, అత్యున్నత వ్యవస్థల్లో తన మనుషుల్ని ఏ స్థాయిలో
పెట్టుకుని ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా మార్చి చూపుతున్నాడో అర్థమవుతోంది.

–ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి... ‘ప్రత్యర్థిపక్షాన్ని’ ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి... అధికారంలో కొనసాగాలనుకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు ముందుగా నా తండ్రిగారిని టార్గెట్ చేశాడు. తరవాత నన్ను టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు నా భార్య శ్రీమతి భారతిని తన మనుషులతో టార్గెట్ చేయిస్తున్నాడు. ఇలాంటి వ్యవహారాల్ని ఆమోదిస్తే ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? రాజకీయాలంటే ఛీ అని ఎవరికైనా అనిపించదా? అందరూ ఆలోచించండి.

హృదయపూర్వక నమస్కారాలతో... 
                         వైయ‌స్ జ‌గ‌న్




      
Back to Top