ఎన్‌డీఏ ఘోరంగా అన్యాయం చేస్తోంది

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌డీఏ ఘోరమైన అన్యాయం చేస్తుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్‌ హక్కు అని, దాన్ని సాధించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ వాయిదా అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. మరోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. ఇవాళ  ఉదయం కూడా స్పీకర్‌ను కలిశామని చెప్పారు. ఏపీ ఘోరంగా నష్టపోయిందని, ప్రజలు వంచింపబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మొదటి నుంచి కూడా కేంద్రం చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరారని చెప్పారు. వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారని, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువభేరిల ద్వారా యువతను చైతన్యవంతం చేశారన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై అనేక సార్లు మాటలు మార్చారన్నారు. తాజాగా యూటర్న్‌ తీసుకొని పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. 
 
Back to Top