దళితులను మట్టుబెట్టాలన్నదే బాబు ఆలోచన

  • బాబు సొంత జిల్లాలో దళిత వ్యతిరేక విధానాలు
  • వాటిని అరికట్టలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి
  • దళితులకు మేలు చేశామనుకుంటే బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్
  • మహానేత వైయస్‌ఆర్‌ పథకాలకు తూట్లు పొడుస్తున్న టీడీపీ సర్కార్‌
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో దళిత వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. దళితులను అసహ్యించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. దళితులపై అస్ప్రుశ్యత, అంటరానితనం, టెంపుల్‌ ఎంట్రీ లేకపోవడం, క్షవరాలు చేయకపోవడం, 2 క్లాస్‌ సిస్టమ్‌ వంటివి కొనసాగుతున్నాయంటే బాబు పాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్‌ సమక్షంలో రాగధ్వేషాలకు అతీతంగా పనిచేస్తానని రాజ్యాంగపై ప్రమాణం చేశావే...ఇలాంటి విధానాలు కొనసాగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మూడు సంవత్సరాల్లో దళితులపై అంటరానితనం కొనసాగుతుంటే ఏం చేశావ్‌ చంద్రబాబు అని నిలదీశారు. దళితులను వ్యతిరేకిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రిగా, అంటరానితనాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కుతావని ఎద్దేవా చేశారు. దళితులకు అవమానాలు జరగలేదని అనుకుంటే చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు సొంత జిల్లాలో పర్యటించి దళితులపై జరుగుతున్న అరాచకాలను ఎండగడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

దళితులకు రాజధానిలో ఒక్క సెంటు భూమైనా ఇచ్చావా...?
దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నాడని మేరుగు మండిపడ్డారు. ఇప్పటి వరకు దళితులకు ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎవరికీ రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌ను మూసేస్తూ నిరుపేద విద్యార్థులకు చదువుకోకుండా దళిత ద్రోహిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్కటైనా నూతన సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు, హాస్టల్స్‌ కట్టిన దాఖళాలు ఉన్నాయా చంద్రబాబు అని నిలదీశారు. రాజధాని ప్రాంతంలో ఒక్క సెంటు భూమి అయినా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌కు కేటాయించావా.. అని ప్రశ్నించారు. దళిత వ్యతిరేక విధానాలతో పరిపాలన చేస్తున్న నీవా.. దళితుల సంక్షేమాన్ని కోరే ముఖ్యమంత్రివి అని విరుచుకుపడ్డారు. దళితులకు టెంపుల్‌ ఎంట్రీ లేదని తెలిసి కూడా చర్యలు తీసుకోలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మేరుగు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం ప్రతి నెల ఏ జిల్లాలోనైనా మీటింగ్‌లు పెట్టావా..? అని నిలదీశారు. దళితులకు మేలు చేస్తున్నాం.. అని చెప్పడానికి ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. దళితులను మట్టుపెట్టడమే చంద్రబాబు ఆలోచన సరళి అని విమర్శించారు. రాజ్యాంగపై నమ్మకం లేకుంటే ఎందుకు అంబేద్కర్‌ రాజ్యాంగపై ప్రమాణం చేశావన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న దళిత వ్యతిరేక విధానాలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top