హైదరాబాద్) గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకొంటున్నానని ప్రచారం చేసిన వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ , రహస్యంగా ప్రైవేటు వైద్యుల చేత చికిత్స చేయించుకొన్న వైనాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పు పట్టారు. కామినేని మోకాలికి కాకుండా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ప్రభుత్వాసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే ఉద్దేశంతో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడం సంతోషదాయకమేనని, ఆయన బయట్నుంచి ప్రైవేటు వైద్యులను, ఇతర పరికరాల్ని తెప్పించుకోవడమే విచిత్రమని అంబటి అన్నారు. సాధారణ ప్రజలకోసమూ ఇలాగే కార్పొరేట్ వైద్యుల్ని రప్పించి చికిత్సలు చేయిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి చర్యలతో ప్రభుత్వాసుపత్రులపై ఇపుడున్న విశ్వాసం కూడా సడలిపోతుందన్నారు.