విశాఖపట్నం: విశాఖలో భూకబ్జాలన్నీ చంద్రబాబు కన్నుసన్నల్లోనే టీడీపీ నేతల చేశారన్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. తప్పు చేసిన ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. సోమవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని ఆయన ధ్వజమెత్తారు. విశాఖలో భూములను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ క్రమంలో కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భూకబ్జాదారుల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని గుర్తు చేశారు. విశాఖ నడిబొడ్డున సైతం భూములను ఆక్రమించారని మండిపడ్డారు.