తాడేపల్లి: ఐటీ దాడులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, నిన్నటి వరకు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్తో మాకేం సంబంధం అన్న టీడీపీ నేతలు.. ఇవాళ ఎందుకు మీడియా ముందుకు వస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం లేకుండా టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. అతి తొందరలో ఈ డబ్బులు చేతులు మారిన బాగోతాన్ని కూడా బయటకు తీస్తారన్నారు. స్వయం ప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు, లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కల్యాణ్ లాంటి వాళ్ల రోగం నయం చేసే మందు కనిపెట్టే పరిస్థితి లేదన్నారు. దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.
ఏపీలోనే కాకుండా తెలంగాణ, మహారాష్ట్రలో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించిందని, ఇన్కం ట్యాక్స్ రైడ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ అనే వ్యక్తిపై జరిగాయన్నారు. సుమారు రూ.2 వేల కోట్లకు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, నిజానిజాలు బయటకు తీస్తామని ఇన్కం ట్యాక్స్ ప్రెస్నోట్ ద్వారా తెలియజేసిందన్నారు. శ్రీనివాస్తో మాకే సంబంధం లేదని నిన్నటి వరకు మాట్లాడిన టీడీపీ నేతలు.. ఇవాళ రూ. 2 లక్షల నగదు, 15 తులాల బంగారం దొరికిందని మాట్లాడుతున్నారన్నారు. నిన్నటి వరకు అతనికి మాకు సంబంధం లేదని ఇవాళ ఎందుకు పిచ్చికుక్కల్లా మీడియా ముందుకు వచ్చారని ప్రశ్నించారు.
దేవినేని ఉమ సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని, చెంప చెల్లుమని ప్రజలు తీర్పు ఇచ్చినా బుద్ధి రాలేదా..? అని ప్రశ్నించారు. దేవినేని ఉమ భాష మార్చుకోకపోతే ఇంటికి వచ్చి తోక కత్తిరిస్తానని ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. ఏబీసీడీలు రాని టీడీపీ నేతలంతా ట్వీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం బీసీలను మోసం చేశాడని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీఎం వైయస్ జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. అందులో 2.65 లక్షల మంది బీసీలేనన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో 95 వేల మంది బీసీలే ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ సీఎం వైయస్ జగన్ చట్టం కూడా తీసుకువచ్చారని గుర్తుచేశారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు అందజేశారని, అందులో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు. బలహీనవర్గాలను సీఎం వైయస్ జగన్ బలంగా తయారు చేస్తున్నారన్నారు. లోకజ్ఞానం లేని లోకేష్కు తన ఉద్యోగం ఊడిపోతుందని భయం పట్టుకుందన్నారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేతలకు జోగి రమేష్ సవాల్ విసిరారు. పచ్చమీడియాను అడ్డుపెట్టుకొని ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.