విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు.విజయవాడ వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం కన్నా ఘోరంగా ఉందన్నారు.ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డకుని, రాళ్లు దాడి చేయడం దారుణమన్నారు.రాష్ట్రంలో కనీసం పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించుకోవడానికి హక్కు లేదా అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్య పరిరక్షించాల్సిన ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.ఒక వైపు చంద్రబాబు నీతులు మాట్లాడతారని,మరో వైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటారని ధ్వజమెత్తారు.ప్రజలంతా చంద్రబాబు తీరును గమనిస్తున్నారన్నారు.దొంగ సర్వేలతో ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారన్నారు.ఓట్లను గల్లంతు చేసే పరిస్థితికి దిగజారారు.సర్వే పేరు చెప్పి ఓట్లు తొలగించే బృందాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు.ఆయన అరెస్ట్ విషయంలో పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను టీడీపీ తన సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేస్తుందన్నారు.వచ్చే ఎన్నికల్లో గెలవాలేమనే భయంతో టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందన్నారు.ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ పార్టీ గుర్తును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.అరాచకాలకు పాల్పడుతున్న చంద్రబాబును నేరస్తుడుగా గుర్తించి అరెస్ట్చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.ఒకరు గజ దొంగయితే,మరోకరు పరమ దొంగ అని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నాయకులు,ఎంపీలు,ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారన్నారు. ట్యాపింగ్ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు.టీడీపీ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద విశ్వాసం లేదన్నారు.ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఓట్లు తొలగిస్తే ఖచ్చితంగా తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.వైయస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రజలు ఛీ కొడుతున్న చంద్రబాబు పట్టించుకోవడంలేదని, దొడ్డిదారిన గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.రాయపాటి సాంబశివరావును అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డమైన ఆరోపణలు చేయిస్తున్నారన్నారు.టీఆర్ఎస్ పార్టీ వారు ఒక ఫార్మా కంపెనీని బెదిరించారంటూ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలను తప్పుబట్టారు.ఆ కంపెనీ ఎవరిదో ఎందుకు చెప్పడం లేదని రాయపాటిని ప్రశ్నించారు.పోలవరం కాంట్రాక్ట్ విషయంలో చంద్రబాబు,రాయపాటికి ఉన్న సంబంధం అందరికి తెలుసునన్నారు. వైయస్ఆర్సీపీకి డబ్బులు ఇవ్వాలని టీఆర్ఎస్ వాళ్లు ఎందుకు బెదిరిస్తారు అని ప్రశ్నించారు.అ«ధికారంలో ఉన్నవారు బెదిరించి డబ్బులు తీసుకుంటారని అనుకుంటే..ఐదేళ్లలో చంద్రబాబు ఎంతమంది పారిశ్రామిక వేత్తలను బెదిరించి ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.పక్క రాష్ట్రాలపై ఆరోపణలు చేసిన చంద్రబాబు వారిపై ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించరని ప్రశ్నించారు. చంద్రబాబు సిబిఐ దర్యాప్తును కోరితే నిజనిజాలు నిగ్గుతేలతాయన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామికంగా ప్రజల్లోకి రావాలన్నారు.దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. అంతేకాని దొంగదారిన అరాచకాలు సృష్టించడం పద్దతి కాదన్నారు.