తాడేపల్లి: చంద్రబాబూ... ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడంపై ఆయన స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 'వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.