మంచి చేస్తున్న‌ ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ ఆశీర్వ‌దించండి

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

సిద్ద‌ప‌ల్లి గ్రామంలో ఎమ్మెల్యేకు ఘ‌న స్వాగ‌తం

 నంద్యాల‌:  అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ ఆశీర్వ‌దించాల‌ని శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కోరారు. ఆత్మ‌కూరు మండ‌లం సిద్ద‌ప‌ల్లి, డెయిరీ కాంప్లెక్స్ గ్రామాల్లో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి శుక్ర‌వారం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు గ్రామ‌స్తులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పూల‌వ‌ర్షం కురిపిస్తు ఘ‌న స్వాగతం ప‌లికారు. అనంత‌రం చ‌క్ర‌పాణిరెడ్డి ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌భుత్వం ఈ మూడున్న‌రేళ్ల‌లో అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించి, వారి స‌మ‌స్య‌లు అడిగి ప‌రిష్క‌రిస్తున్నారు. 

ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల పెంచ‌డ‌మే ల‌క్ష్యం
ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి తెలిపారు.  విశాల దృక్ప‌థంతో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ.. అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తున్నార‌ని తెలిపారు.  సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా,జీవ‌న ప్ర‌మాణాల ఉన్న‌తే ల‌క్ష్యంగా చేసుకుని తాము పాల‌న సాగిస్తున్నా మ‌ని అన్నారు. న‌వ‌ర‌త్నాల‌తో ఈ ప్ర‌భుత్వం పేద‌లకు, ఇత‌ర బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చేరువైంద‌న్నారు. 8వ తరగతి విద్యార్థుల‌కు టాబ్స్ ఇచ్చారు అంటే వాళ్లేమ‌యినా వచ్చే ఎల‌క్షన్ నాటికి ఓటు వేస్తారని ఇచ్చారా ? అని అన్నారు. 

ప్ర‌పంచంతో పోటీ ప‌డాల‌ని..
ప్ర‌తి పేద కుటుంబలో ఉండే విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించి, పోటీ ప్రపంచంలో నిల‌దొక్కుకోవాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జగన్ ఆలోచన అని ఎమ్మెల్యే చ‌క్ర‌పాణిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క‌ మార్పులు చేశాం. నాడు నేడు పేరిట వాటిని అభివృద్ధి చేశాం. సిల‌బ‌స్-లో మార్పులు చేయించాం. త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంపే  త‌ల్లుల అకౌంట్లో అమ్మ ఒడి పేరిట రూ.15వేలు జమ చేశాం. చంద్రబాబు ఎప్పుడూ సైకిళ్లు, పాల క్యాన్లు ఇచ్చారే తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏం చేశారని ప్ర‌శ్నించారు?

ఠంచ‌న్‌గా పింఛ‌న్‌
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ల‌బ్ధిదారుల‌కు ప్ర‌తి నెల 1వ తేదీన ఠంచ‌న్‌గా పింఛ‌న్ అందిస్తున్నామ‌ని ఎమ్మెల్యే శిల్పా తెలిపారు.  రూ.2 వేలు పెన్షన్ ఇచ్చానని చంద్ర‌బాబు అంటున్నారు. ఎప్పుడూ ఇచ్చారు అంటే ఆ పెంచిన పెన్షన్ కూడా ఎన్నికల ముందు కాదా ? అని నిల‌దీశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన వాగ్ధానం మేర‌కు పింఛ‌న్ రూ.3 వేల వ‌ర‌కు పెంచుతూ పోతున్నార‌ని తెలిపారు. ఈ నెల‌లోనే రూ.2750 వ‌ర‌కు పింఛ‌న్‌ను పెంచామ‌ని, అర్హ‌త క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రికి పింఛ‌న్లు మంజూరు చేస్తున్నామ‌ని తెలిపారు.   అభివృద్ధిని చూసి ఓర్వ‌లేక  ప్రతిపక్ష నాయ‌కులు.. బాదుడే..బాదుడు, ఇదేం ఖ‌ర్మ అంటూ ప్ర‌జ‌ల ముందుకు వెళ్లి అభాసుపాల‌వుతున్నార‌ని చెప్పారు. పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి అని ప‌దే ప‌దే అంటున్నారు. ఒకసారి దేశం మొత్తం మీద ఉన్న ధ‌ర‌లు కంపేర్ చేసి చూడండి. ధరలు అనేవి కేంద్ర ప్రభుత్వం నిర్థార‌ణ చేస్తాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో ఒకే విధంగా ధరలు ఉంటాయి. ఇది గమనించాలి. విప‌క్ష నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారు. నిత్యావ‌స‌రాలు ఎక్కడైనా చవకగా దొరుకుతున్నాయా ? ఉంటే చెప్పండి. డ్వాక్రా రుణాలు అని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే, సీఎం వైయ‌స్ జగన్ నాలుగు విడతల్లో చెల్లిస్తా అని చెప్పారు. ఇప్పటికే మూడు సార్లు చెల్లించాం. త్వ‌ర‌లోనే మ‌రో విడ‌త చెల్లిస్తామ‌ని చెప్పారు.   ఊళ్ల‌లో రోడ్ల నిర్మాణం, సచివాలయం, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు  ఇవి అన్నీ అభివృద్ధి కావా ? అని చ‌క్ర‌పాణిరెడ్డి విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు.
కార్య‌క్ర‌మంలో సిద్దేప‌ల్లి స‌ర్పంచ్ రేనాటి పెద్ద ఎల్లారెడ్డి, ఆత్మ‌కూరు మండ‌ల వైస్ ఎంపీపీ రేనాటి ప‌ద్మ‌జా ర‌మ‌ణారెడ్డి, మాజీ స‌ర్పంచ్ మార్త భాస్క‌ర్‌, నాయ‌కులు రేనాటి చంద్రారెడ్డి, ముర‌ళి, పార్ధ‌సార‌ధిరెడ్డి, హ‌నుమంత‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top