హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ముగిసింది. మూడు రోజుల పాటు మొత్తం 18 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. రాజధానిలో షర్మిల పర్యటనకు అపూర్వ ఆదరణ లభించింది. గ్రేటర్ ప్రజలు రాజన్న బిడ్డకు నీరాజనం పట్టారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు.<br/>మూడో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ నుంచి బయలుదేరారు. రహమత్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, రసూల్ పురలలో వైఎస్ షర్మల పర్యటించారు. రహ్మత్ నగర్ లో మడత సత్యనారాయణ కుటుంబాన్ని, ఖైరతాబాద్ సమీపంలోని మారుతీనగర్ లో మంగలరావు శివలాల్ యాదవ్ కుటుంబాన్ని అదేవిధంగా రసూల్ పుర ప్రాంతంలో దివంగత లత కుమార్తె రేణుక కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారిలో ధైర్యం నింపారు. <br/><br/>గ్రేటర్ పర్యటన ముగించుకొని ప్యారడైజ్, తాడ్ బండ్ మీదుగా షర్మిల నిజామాబాద్ జిల్లాకు బయలుదేరారు. జిల్లాలోని పిట్లం వద్ద షర్మిలకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మహానేత ఆకస్మిక మృతిని తట్టుకోలేక జిల్లాలో 19 మంది తనువు చాలించారు. మొదటి విడత పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల 12 కుటుంబాలను ఓదార్చారు. రెండో విడతలో భాగంగా రెండ్రోజుల పాటు ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పరామర్శయాత్ర కొనసాగుతోంది. వైఎస్సార్ కోసం అసువులు బాసిన వారి స్మారకార్థం గాంధారి మండలం పోతంగల్ కలాన్ సమీపంలో శుక్రవారం పైలాన్ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు