<strong>ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర</strong><strong>ఆర్టీసీ, కార్మికుల భవిష్యత్తు బాగుపడాలంటే..</strong><strong>వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ తోనే సాధ్యం</strong><br/>వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్జూర్ యూనియన్ ను బలిష్టంగా తయారు చేసుకుంటామని వైఎస్సార్సీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి తెలిపారు. ఆర్టీసీ మనుగడ, కార్మికుల భద్రతే తమకు ముఖ్యమని నేతలు తేల్చిచెప్పారు. రాష్ట్రం విడిపోయాక ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఒకటో తారీఖు కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ఏదో డిపోను తాకట్టుపెట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు ఆర్టీసీ బాధ్యత మరచి ఇంకా నష్టాల్లో కూరుకుపోయే విధంగా కుట్ర పన్నుతున్నారన్నారు. <br/>చంద్రబాబు ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా ఆస్తులన్నీ తెగనమ్మే కుట్ర చేస్తున్నాడని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ, కార్మికుల బాగుకోసం ఎంతో మేలు చేశారని చెప్పారు. 10 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్, ట్యాక్స్ బెనిఫిట్స్ సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. ఇవాళ్టికీ ఆర్టీసీ మనుగడ సాగిస్తుందంటే అది మహానేత చలవేనని ప్రతి కార్మికుడు విశ్వసిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఇతర యూనియన్లు బలంగా లేకపోవడంతో మేనేజ్ మెంట్ ఆర్టీసీ వర్కర్లను వేధిస్తోందని మండిపడ్డారు. <br/>ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్ జగన్ గతంలో చెప్పిన విషయాన్ని నేతలు ఈసందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్మికుల భవిష్యత్తుకు వైఎస్సార్సీపీ భద్రత కల్పిస్తుందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని...జననేతను గెలిపించుకుంటే కార్మికుల శ్రేయస్సుకోసం పాటుపడుతారని నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ , కార్మికుల భవిష్యత్తు బాగుండాలంటే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ బలపడాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి బలపర్చాలని పిలుపునిచ్చారు. గుంటూరు, విజయవాడలలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేతలు సమావేశమయ్యారు. <br/>మహానేత మాదిరి వైఎస్ జగన్ కూడా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని లాభాల్లోకి తెస్తారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా..దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఏపీలో ధరలు, ట్యాక్స్ విపరీతంగా పెంచేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వర్కర్లను తగ్గించి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. విమానాల మీద వాడే ట్యాక్స్ వన్ పర్సెంట్ వేసి, ఆర్టీసీ బస్సులు వాడే ఇంధనాల మీద 15 పర్సెంట్ ట్యాక్స్ వేశారన్నారు. ఇక పార్టీ అవసరాల కోసం ఆర్టీసీని వాడుకుంటూ పైసా కూడా కట్టడం లేదని ధ్వజమెత్తారు.