కరీంనగర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం..కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చాండ్రడా గ్రామంలో మహిళలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు.<br/>బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదని నేతలు దుయ్యబట్టారు. రాజన్న హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు తన హయంలో కరెంట్ మీటర్లు ఎత్తుకెళ్తే ...వైఎస్సార్ తన పాలనలో ఉచిత కంరెంట్ ను అందజేశారని నూతనంగా చేరిన మహిళ కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 49 మండలాల్లో అధికారులు కరువు నివేదికలు ఇచ్చినప్పటికి కేసీఆర్ రైతులను ఆదుకున్న పాపాన పోవడం లేదని మండిపడ్డారు.