కమల్ రాజు గెలుపు ఖాయం

ప్రజల గుండెల్లో దేవుడిగా రాజన్న
ఆయన సంక్షేమపథకాలే గెలుపు ధీమా
కడిగిన ఆణిముత్యం కమల్ రాజ్ః పొంగులేటి

ఖమ్మంః మహానేత మరణించి ఆరేళ్లయినా...దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను తలచుకుంటూ ప్రజానీకం జీవిస్తుందని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమల్ రాజు గెలుపొందడం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీల తో పాటు తనతో కలిపి సుమారుగా 109 ఓట్లు ఉన్నట్లు చెప్పారు.  

సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయని అన్నారు. ఖమ్మంలో 3 స్థానాలే గెలిచిన టీఆర్ఎస్ ప్రలోభాలతో అభ్యర్థులను లాక్కొని టికెట్ ఇచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ ఒక్కటే ఒంటరిగా అభ్యర్థిని నిలబెట్టిందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఉద్యమపార్టీలో చిత్తశుద్ధితో నికార్సుగా పనిచేసిన కడిగిన అణిముత్యం లాంటి నాయకుడు కమల్ రాజ్ ను తమ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. మిగతా అభ్యర్థులకు, తమ అభ్యర్థికి మధ్య తేడాను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 

ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రాజన్న ప్రజల  గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పొంగులేటి కొనియాడారు. తమ గెలుపునకు అది ఒక్కటి చాలన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ పేరు చెప్పడంతోనే గత తాలూకు  జ్ఞాపకం తెచ్చుకొని ...పరిపాలన అంటో అది అని, అలాంటి పరిపాలన కావాలన్న ఆలోచనతో ఉన్నామని ఎంతోమంది నాయకులు తనకు చెప్పారన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గౌరవించి పెద్దపీట వేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిదేనని పొంగులేటి పేర్కొన్నారు. కానీ,  టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఏ పనిలేకుండా చేసిందని ఆయన మండిపడ్డారు. నిధులు ఇవ్వకపోవడంతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారన్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమాభిమానాలు ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ముగిసిన తర్వాత మిగిలిన రాజకీయ పార్టీల నాయకులకు తెలుస్తుందన్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్పు చూసి షాకవ్వడం ఖాయమన్నారు.  రాజశేఖర్ రెడ్డి  కుటుంబానికి అండగా ఉండాలని గత ఎన్నికల్లోనే ప్రజలు తమ తీర్పు ద్వారా తెలియజేశారన్నారు. ఎవరో ఒక్కరు వెళ్లినంత మాత్రాన పార్టీకొచ్చే నష్టమేమి లేదని...వైఎస్సార్  అభిమానులంతా పార్టీ వెంటే ఉన్నారన్నారు. 

Back to Top