తాడేపల్లి: రాష్ట్రంలో రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని ఈ అసమర్థ కూటమి ప్రభుత్వం, సూపర్ సిక్స్ హామీలపై విజయోత్సవాలు చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతాంగానికి అండగ వైయస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టడంతో, దానిని డైవర్ట్ చేయడానికే సూపర్ సిక్స్ విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే... రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయడానికి వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమన్ని నిర్వహిస్తున్నాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్నాం. రైతులకు అండగా వైయస్ఆర్సీపీ నిలుస్తోంది. అన్నదాత పోరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొంటుందనే భయంతోనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అంటూ ఓ పనికిమాలిన కార్యక్రమానికి సిద్దమైంది. సూపర్ సిక్స్లో అతి చిన్న హామీ అయిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లనే సక్రమంగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం విడ్దూరంగా ఉంది. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రైతు సమస్యల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదు రైతుల కష్టాలని పరిష్కరించాలన్న కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు. గతేడాది పండించిన పంటలకే మద్దతు ధరలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే మళ్లీ ఈ ఏడాది సాగు ప్రారంభిస్తున్న రైతుల నెత్తిన యూరియా కొరత రూపంలో మరో పిడుగు పడింది. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. గత ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడితే, నేడు కూటమి 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా వ్యవసాయం దండగే అనే విధంగా పాలన చేస్తున్నాడు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు క్యూ లైన్లలో నిలబడినా ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదు. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులపై సీఎం చంద్రబాబు పార్టీల ముద్ర వేయడం దుర్మార్గం. రైతులకు పార్టీ ముద్ర వేయడం ద్వారా యూరియా కొరత లేదని చంద్రబాబు చెప్పాలనుకుంటున్నారు. బెదిరించి ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలని ప్రయత్నం చేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు ఓర్వలేకపోతున్నారు. యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనగా మాట్లాడుతున్నాడు. రైతన్నకు అండగా వైయస్ఆర్సీపీ సమస్యలపై రైతుల పక్షాన అండగా నిలిచేందుకు 'అన్నదాత పోరు' పేరుతో వైయస్ఆర్సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీలు నిర్వహించిన అనంతరం అధికారులకు రైతుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి నిజాయితీగా పరిష్కరించాల్సిందిపోయి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీస్తోంది. ఈనెల 10న అనంతపురంలో సూపర్ సిక్స్- సూపర్ సక్సెస్ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించాలని చూడటం సిగ్గుచేటు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించాలి. ఆర్బీకే సెంటర్ల ద్వారా ముందుగానే పంటలకు సంబంధించి సమగ్ర వివరాలు తెప్పించి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయడం జరిగింది. కానీ నేడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఈ క్రాపింగ్ తూతూమంత్రంగా చేస్తున్నారు. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. రాష్ట్రంలో ఆక్వా రంగం కుప్పకూలిపోయింది. ఆక్వా రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. గతంలోనూ రైతు రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దారుణంగా మోసం చేశాడు. రైతులకు చేసిన సాయంపై కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా చర్చకు సిద్ధం. కనీసం కట్ట యూరియా కూడా అందించలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఏదో చేసినట్టు ప్రజలను భ్రమింపజేయాలనే ఉద్దేశంతో సంబరాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారు