శ్రీకాకుళం : నిజాయితీగా మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదని రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.."మీరు ఇచ్చిన అధికారంతో ఈ ఐదు సంవత్సరాలూ శాసన సభలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాను. ఈ ప్రభుత్వ పనితీరు మీరు చూసి ఉంటారు. ఈ ఐదేళ్లలో పది సార్లు మీ గడపలకు వచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీకు వివరించడం జరిగింది. అందులో లోపాలు ఉంటే దిద్దుకునే ప్రయత్నాలు చేశాం. అందుకే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడంలో అవినీతికి తావులేని గౌరవ ప్రద జీవనానికి భంగం వాటిల్లనివ్వని పద్ధతి మీ అందరికీ లభించింది. సంక్షేమ కార్యక్రమాలు ఒక కుటుంబంలో ఉన్న రకరకాల వయస్సుల వాళ్లు, ఉన్నటువంటి స్త్రీలు వారికి ఏ రకం అయిన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించాలో అన్న విషయమై వివిధ పథకాలను రూపకల్పన చేశాం. ఆ రూపకల్పన చేసే పథకాలను మీకు అందించాం. కులం చూడలేదు, మతం చూడలేదు. రేపు ఓటు వేస్తారా ? లేదా ? అన్నది కూడా చూడలే. పథకం ఇచ్చినప్పుడు అర్హతను ప్రామాణికంగా తీసుకుని గౌరవంగా పథకాలు అందించాం. నిష్పాక్షిక ధోరణిలో భాగంగా పథకాలను అమలు చేశాం. లంచాలకు తావులేకుండా పథకాలు అందుకున్నాం అని మీరంతా మీరు ఆ రోజు చెప్పారు. అందుకే మేం అడుగుతున్నాం ఈ పాలన బాగుంది అని అనుకుంటే ఈ పాలన వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉందని అనుకుంటే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నాడు నేడులో భాగంగా మీ వార్డులో ఉన్న స్కూల్ ను డెవలప్ చేశాం. అలానే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి పిల్లలకు అవసరం అయినటువంటి పుస్తకాలనూ, యూనిఫాంలను ఇంకా 19 రకాల వస్తువులను అందించాం. ఇందుకు ఏటా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించాం. పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టి,విద్యార్థుల తల్లుల ఖాతాలకు అమ్మ ఒడి పేరిట పదిహేను వేలు రూపాయలు వేశాం. పేదరికం కారణంగా పిల్లలను కూలీ పనులకు పంపకుండా ఉండేందుకు తల్లులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడీ పదిహేను వేల రూపాయలనూ పదిహేడు వేల రూపాయలకు పెంచుతున్నాం. పేద బిడ్డలంతా చదువుకోవాలని చదువు వల్లే ఈ సమాజంలో ఉన్న అంతరాలు తగ్గుతాయి అని భావించి ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేశాం. పరిపాలనలో చూడండి వస్తున్న మార్పులు గమనించండి. పాలన వికేంద్రీకరణలో భాగంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఐదేళ్లలో వచ్చినటువంటి సంస్కరణలు. చంద్రబాబు నాయుడు ప్రతి సారీ అబద్ధాలతో ప్రజల ముందుకు వస్తుంటారు. అలానే 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో డ్వాక్రారుణాలు మాఫీ చేస్తానని, రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. కానీ చేయలేదు. ఎన్నికలయ్యాక చేశాడా ? అని అడుగుతున్నాను. మళ్లీ ఇప్పుడు ఆయన అబద్ధాలతోనే ప్రజల ముందుకు వస్తున్నాడు.ఆ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని అన్నాడు. బాబు వస్తే జాబు వస్తుందని గోడలంతా స్లోగన్లతో ఆ రోజు నింపేశారు. ఇచ్చాడా ? 20లక్షలు కాదు కనీసం 200 ఉద్యోగాలు అయినా ఇచ్చాడా అని అడుగుతున్నాను. ఆయన మాట నిజం అని నమ్మారు. ఇవాళ నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఇస్తా అని అన్నాడు కానీ ఇచ్చాడా ? చంద్రబాబు మాటకారితనాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. చంద్రబాబుకు మ్యానిఫెస్టో అంటే చెత్త కాగితంతో సమానం. బీదల పట్ల చంద్రబాబు నాయుడు ఎంత కఠినంగా వ్యవహరించాడో మీరంతా చూసే ఉంటారు. పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా అయిపోతుంది అన్న పెద్ద మనిషి. ఇవాళ మీరంతా సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవన్నీ గుర్తుకు పెట్టుకుని మీకు మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి ఇవ్వండి. ఆయన మాటలను మనం ఎవ్వరైనా నమ్మవచ్చా. ఆయనకు అధికారం కావాలి. అధికారంతో వ్యాపారం చేస్తాడు. రాష్ట్రం విడిపోయింది దెబ్బతిన్నాం అన్న బాధలో ఉంటే రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఆయన తయారు అయ్యాడు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెప్పి దొంగలందరినీ తెచ్చి రైతుల భూమలు లాక్కొని ప్రజలకు సంబంధం లేని రాజధాని కట్టి డబ్బు దోపిడీ చేయాలని చూశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే డబ్బులన్నీ ఒక్కచోటే పెట్టకూడదు. ఆ రోజు హైద్రాబాద్ విషయమై ఇలాంటి తప్పిదమే జరిగింది. మళ్లీ మరోసారి ఇటువంటి తప్పిదం జరగకూడదని ఆశించి అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ ముందుకు వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత నష్టపోయిన ప్రాంతాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే శ్రీకాకుళంలో ఒక్క సంస్థ అయినా పెట్టనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. వెనుకబడిన ప్రాంతాలు డెవలప్ కావాలంటే ఎలా అవుతాయి ? మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓటు కావాలని చంద్రబాబు ఈ జిల్లా ప్రజలను అడుగుతున్నాడు.? ఇదే సందర్భంలో నేను ఆయన్ను అడుగుతున్నాను...ఏం నువ్వు చేశావని ఓటు అడుగుతున్నావు.? ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన విషయాలు. చిన్నవి అనుకోకండి. మనందరి జీవితాలూ బాగుపడేవి ఒక ప్రభుత్వం అనుసరించే పద్ధతుల వల్లే అని మీకు విన్నవిస్తున్నాను. మీరంతా ఆలోచించండి.. మీ అకౌంట్లలో పడిన డబ్బులు ఒక్కసారి ఎంతో లెక్క చూడండి. ఆ డబ్బు కారణంగా మీకుటుంబాలు ఏ విధంగా బాగు పడ్డాయో ఆలోచించండి. ఈ ప్రభుత్వం లేని రోజు ఏ ప్రభుత్వం కూడా ఈ పథకాలను కొనసాగించదు అనేటటువంటి మాట నేను కాదు చంద్రబాబే చెబుతున్నాడు. దివాలా అయిపోతుందని అన్నాడు..రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజులా అయిపోతుంది అన్నవాడు ఇప్పుడెలా పథకాలు జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తానని అంటున్నాడు. ఏ విధంగా అనగలుగుతున్నాడు. ఇక్కడ వ్యాపార వర్గాలు ఉన్నాయి. మీరు ఊరకనే వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిగా భావించవద్దని మనవి చేస్తున్నాను. ఒక్కసారి నేషనల్ లెవల్ లో మన రాష్ట్రంకు సంబంధించి వివరాలు చూడండి. జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు రూపొందించే సూచీలు చూడండి. ఒక్క సారి మీరు కంప్యూటర్లు ఆన్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆ రోజు చంద్రబాబు తనకు మద్దతుగా నిలిచే దొంగ పత్రికలతో దొంగ రాతలతో అబద్ధపు ప్రచారం చేయించాడే తప్ప రాష్ట్రాన్ని ఏనాడూ ఆయన అభివృద్ధి చేయలేదని విన్నవిస్తూ ఉన్నాను. ఇవాళ జీఎస్డీపీ కానీ ఇండస్ట్రీయల్ గ్రోత్ లో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ గణనీయ ప్రగతి సాధించింది. పైకొచ్చింది. ఆఖరికి తెలుగు దేశం పార్టీ హయాంలో ఇంత కన్నా అధ్వానంగా అభివృద్ధి సూచీలూ,సంబంధిత వివరాలూ ఉండేవి. చంద్రబాబు పేరు చెబితే కనిపించే అభివృద్ధి చూపించండి. మీ వార్డులలో ఉన్న బడులను ప్రయివేటు స్కూల్స్ కు దీటుగా తయారు చేశాం. వాళ్లు చేశారా ? ఇవాళ మీ అందరికీ అనువుగా ఉండేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ చేశాం.. వాళ్లు చేశారా ? అలానే మార్కెట్టును బాగు చేశాం మేమే.. వాళ్లేమయినా చేశారా ? ఐదు వందల కోట్లు పెట్టి భూమి కొని ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం.. వాళ్లు చేశారా ? అతను సగంలోనే నిర్మాణపు పనులు వదిలేసిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి సంబంధిత లబ్ధిదారులకు అందించాం. ఈ పట్టణంలో ఉన్నవారందరికీ నగరం చుట్టూ ఊళ్లకు ఊళ్లే నిర్మాణం జరుగుతోంది. మీ అందరికీ వైద్యం అందించే జిల్లా ఆస్పత్రి వెళ్లి ఒక్కసారి చూడండి. చంద్రబాబు హయాంలో ఏనాడయినా ఆ ఆస్పత్రిని పట్టించుకున్నారా అని అడుగుతున్నాను. ? ఈ పట్టణంలో ఈ వార్డులో రోడ్లూ,డ్రైన్లూ నిర్మించి, ఇంటింటికీ కుళాయి అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టిందని మీకు విన్నవిస్తున్నాను. అభివృద్ధి లేదని చంద్రబాబు అంటే సరిపోతుందా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి ? చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అన్నీ వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. దయచేసి మీరు ఊరకనే వైఎస్సార్ కాంగ్రెస్ ను అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక వ్యాపారాలు చేస్తున్న వారు ఈ నగరంలో ఉన్నారు. మీ వ్యాపార సంఘాల నాయకులను అడగండి. ఏ ఒక్క అధికారి ఒత్తిడి ,దౌర్జన్యం అన్నవి ఉన్నాయా ? అవినీతి అన్నది ఎక్కడైనా జరిగిందా ? ఎక్కడైనా దోపిడీ జరిగిందా ? అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. క్షేత్ర స్థాయిలో అవినీతి లేనందున ఇవాళ వ్యాపార వర్గాలు హాయిగా ఉన్నాయి. ఇవన్నీ పద్ధతి ప్రకారం సాగుతున్నాయంటే అందుకు కారణం మీరు ఎన్నుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వమే. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. ప్రతి పదిహేనేళ్లకూ రెసిషన్ (మాంద్యం) వస్తుంది. అందులో భాగంగానే చాలా వ్యాపార లావాదేవీలు తగ్గాయి. అందుకు జగన్మోహన్ రెడ్డి కారణం కాదని,మీరంతా ఆయనపై కోపం పెంచుకోవద్దని మనవి చేస్తున్నాను. సిస్టమేటిక్ పరిపాలన ఈ ఐదేళ్లూ జగన్ చేశారు. ధనాన్నంతా ప్రజలకు చేరవేసే పని చేశారు. దోపిడీకి అస్సలు అవకాశమే ఇవ్వలేదు. పాలనలో చిన్న చిన్న తప్పిదాలు ఉంటే వాటిని దిద్దుకుంటాం. ఇక్కడున్న దేవాంగులను ఆదుకున్నాం. ఇరవై నాలుగు వేలు అందించాం. మీకు సాయం చేసిన జగన్ కు అండగా నిలవండి. అలానే ఈ ప్రాంతంలో ఉన్న వృద్ధులకు నెల మూడు వేల రూపాయలు అందించాం. అలానే 45 ఏళ్లు దాటి 60 ఏళ్లు మధ్య ఉన్న వారికి చేయూత పథకం కింద 75వేలు అందించాం. ఇప్పుడు రానున్న ఐదేళ్లకూ లక్షా యాభై వేలు రూపాయలు అదే పథకం కింద అందించనున్నాం. ఈ విధంగా ఎన్నో చేశాం. ఏమీ చేయలేని చంద్రబాబు గొప్ప నాయకుడా ? ఎలా అవుతాడు. వైయస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే భూములు లాక్కొంటాడు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. బుద్ధి ఉన్నవాడెవ్వడయినా అనే మాట ఇదేనా ? అది ఈ దేశాన సాధ్యమేనా ?మన రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ అలాంటి వెసులుబాటు ఉందా ? ఏదయినా అవసరం అయిన ప్రభుత్వం భూమి సేకరిస్తే 2013లో వచ్చిన పార్లమెంట్ యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించే అవకాశం ఉంది కానీ భూములు లాక్కొనే అవకాశం ఉందా ? ఇవన్నీ అసత్య ప్రచారాలు.. నిజాయితీగా మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదు. ఇలాంటి స్థితిలో చంద్రబాబు ఆలోచన పేలవంగా ఉందో మీరు చెప్పండి. వలంటీర్లను తిట్టారు. ఇప్పుడు వలంటీర్లకు పదివేలు ఇస్తాం అని అంటున్నారు. ఆ రోజు వలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదని పిటిషన్లు పెట్టారు. ఇప్పుడేమో ఇంటింటికీ పోయి పింఛను ఇవ్వాలని మీరే అంటున్నారు. అంతకుముందు వలంటీర్లు దొంగలు అని చెప్పలేదా ? నీతో ఉన్న పెద్ద మనిషి వీళ్లు రౌడీలూ అని చెప్పలేదా ? ఏ రోజూ ఏ మాటకూ పొంతన ఉండదు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని,చేసిన మేలు గుర్తు పెట్టుకుని నన్ను మరోసారి గెలిపించండి అని విన్నవిస్తూనాను అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.