పేదలందరికీ ఇళ్లు
సచివాలయం: నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అందరికీ ఇళ్లు ప్రతిష్టాత్మకమైన పథకమన్నారు. నాలుగు విడతల్లో ఇళ్ల స్థలాలు పొందిన వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు ఇందుకు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు మార్చి చివరి నాటికి ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ నిధుల్ని దారి మళ్లించిందని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి గుర్తించామన్నారు. ఇళ్ల స్థలాల కోసం దేవాదాయ భూముల్ని తీసుకోవడం లేదన్నారు. బలవంతంగా భూ సేకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. అందరి సహకారంతో భూముల్ని సేకరిస్తామని, ఎవరినీ బలవంత పెట్టమని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా పేదలకు ఒక సెంట్ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఈ రోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Also: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలకు కేబినెట్ ఆమోదం