విద్యారంగ సంస్థలను బాగు చేస్తాం
అమరావతి: ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను బాగు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్, ఫర్నీచర్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డ్స్, పెయింటింగ్, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. నాడు- నేడు కింద స్కూళ్లల్లో 9 రకాల పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్ లిస్టు ఉండాలని సూచించారు.నవంబర్ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం వైయస్ జగన్ వెల్లడించారు. నాడు-నేడులో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఆపై వచ్చే ఏడాది 9వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని తెలిపారు. దీనికి సంబంధించిన పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లు ప్రారంభం కాగానే యూనిఫామ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదని అధికారులను హెచ్చరించారు.