బాలాజీ నగర్‌లో “కాఫీ విత్ క్యాడర్” కార్యక్రమం 

6 Apr, 2026 12:23 IST

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం, సోమందేపల్లి మేజర్ పంచాయతీలోని బాలాజీ నగర్‌లో సోమవారం “కాఫీ విత్ క్యాడర్” కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌ పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిందని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన ఉషశ్రీచరణ్, నేతన్నలకు ప్రతి సంవత్సరం రూ.24 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, 50 సంవత్సరాలు దాటిన అర్హులైన వారికి నెలవారీ పెన్షన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం అదే అని తెలిపారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని ఆమె విమర్శించారు. ఈ విషయాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ మద్దతు కోరారు.