తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల చరిత్రలో వైయస్ఆర్ సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ వైయస్సార్సీపీ హవా కొనసాగించింది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైయస్సార్ కడప, అనంతపురం కార్పొరేషన్ వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఇక 75 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకూ వైయస్సార్సీపీ 74 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అనంతపురం కార్పొరేషన్లో టీడీపీ ఖాతా తెరవలేదు. ధర్మవరం మున్సిపాలిటీలోనూ టీడీపీ సున్నా. గుత్తిలో ఒకటి, రాయదుర్గంలో 2 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీకి సున్నా వార్డులు. యనమల రామకృష్ణుడు సొంతూరు తునిలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, రామచంద్రాపురంలో ఒక్క వార్డుతో.. పెద్దాపురం, గొల్లప్రోలులో రెండు వార్డులతో టీడీపీ సరిపెట్టుకుంది. వైయస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడంతో తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా పేల్చి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.