వారానికి ఆరు రోజులు`ఉపాధి` కల్పించాలి
ఎన్టీఆర్ జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కార్మికులకు వారానికి ఆరు రోజులు పనులు కల్పించాలని వైయస్ఆర్సీపీ తిరువూరు ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ డిమాండ్ చేశారు. తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులను స్వామిదాస్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం అందజేస్తున్న పనిదినాలపై కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి సమస్యలపై ఆరా తీశారు. గత ప్రభుత్వం 10 కోట్ల 70 లక్షల పని దినాలు కల్పించిందని స్వామిదాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించిందని మండిపడ్డారు. కూలీలు 6 రోజులు పనిచేస్తే 3రోజులు మాత్రమే మస్టర్ వేస్తున్నారని, పేదలు కష్టపడి పనిచేస్తే నెలల తరబడి వేతనాలు జమ చేయడం లేదన్నారు. ఉపాధి కూలీలకు కనీసం టెంట్, మజ్జిగ, ఓఆర్ఎస్, కనీసం మంచినీరు సైతం ప్రభుత్వం అందించడం లేదని ఆక్షేపించారు. రాజకీయాలకు తావు లేకుండా ఉపాధి కూలీలకు పని దినాలు కల్పించాలని ఆయన కోరారు. అనుభవం లేని ఫీల్డ్ అసిస్టెంట్ల వలన నష్టం జరుగుతుందని, ఉపాధి హామీని సక్రమంగా అమలు చేయాలని, వారానికి ఆరు రోజులు పని దినాలు కల్పించాలని స్వామిదాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.