కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
పల్నాడు: ఇబ్బందుల్లో ఉన్న పార్టీ కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల టిడిపి నాయకులు చేతిలో కత్తిపోట్లకు గురై ఇబ్బందులు పడుతున్న వినుకొండ నియోజకవర్గం టీ అన్నారం గ్రామానికి చెందిన భీమనాదం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని పార్టీ అధినేత వైయస్ జగన్ , పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదుకున్నారు. ఈ మేరకు వైయస్ జగన్ తరఫున రూ.2 లక్షలు, ఎమ్మెల్యే మరో లక్ష రూపాయలు వెంకట ప్రసాద్ సతీమణి శ్రావణికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంల మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ..టి అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసు తో భీమనాదం వెంకట ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టిడిపి నాయకులు కత్తితో దాడి చేశారని తెలిపారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రసాద్కు సకాలంలో వైద్యం అందించడంతో 45 రోజులు చికిత్స అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని తెలిపారు. అయితే ఇప్పటివరకు పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు. ప్రస్తుతం వినుకొండ టౌన్ సీఐ ..టీడీపీఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మెప్పుకోసం వైయస్ఆర్ సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాలతోనే కారుమంచి గ్రామంలో 16 మంది వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని, వినాయక చవితి సందర్భంగా జరిగిన గొడవను కూడా ఎలాంటి దెబ్బలు లేకపోయినా కేవలం ఒకవైపున కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. వినుకొండకు రూ.150 కోట్లు నిధులు తెచ్చామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. వైయస్ఆర్సీపీ ఎలాంటి ఇబ్బంది కలిగిన తాను, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.