సకల శాఖ మంత్రిగా నారా లోకేష్ అవతారం

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా కొత్త అవతారం ఎత్తారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. తనకు సంబంధం లేని మంత్రిత్వ శాఖల్లో లోకేష్ తలదూర్చి అన్నీ తానై వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. శనివారం అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడారు. `రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్ష్యాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్ తో ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీరిని అరెస్టు చేశారు. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దే. నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైయస్ జగన్ పాలనలో 22 వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టింది. వీటిని తానే సాధించినట్లుగా లోకేష్ చెప్పుకుంటూ నిన్న అనంతపురంలో రెన్యూ ప్రాజెక్టుకు భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉంది. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదు. వైయస్ జగన్ సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహం లో అమ్మాయిలకు ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటన లో నారా లోకేష్ సాధించింది శూన్యం` అంటూ శ్యామల విమర్శించారు.