అనితా.. నోటిని అదుపులో పెట్టుకో

2 Apr, 2026 19:01 IST


తాడేపల్లి: మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిపై హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్య‌ల‌ను   వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగ మల్లీశ్వరి ఖండించారు. రాష్ట్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరు బాధ్యతాయుతంగా ఉండాలని, కానీ అనిత వ్యాఖ్యలు ఆ పదవికి ఏమాత్రం సరిపడవని ఆమె ఆక్షేపించారు. అనిత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని, హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడ‌టం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 

 వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గారు నిన్న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ్రమలు కల్పిస్తూ.. ఏ రాజధానీ లేకుండా చేస్తున్నార‌ని స్ప‌ష్టంగా వివ‌రించారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్‌ ఇంజిన్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం తాను ప్రతిపాదించిన ప్లాన్‌ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్‌ ‘మావిగన్‌’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్‌’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు.  ఇవి అర్థం చేసుకోకుండా హోం మంత్రి వంటి బాధ్య‌తాయుత ప‌ద‌విలో ఉన్న అనిత మాజీ సీఎంపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. 
     రాష్ట్రంలో మహిళల భద్రత ఏ మాత్రం పట్టించుకోని హోమ్ మంత్రి కేవలం జగన్ గారిపై విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు. హోంమంత్రి బాధ్యతలు మరిచి రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నారు. రాజ‌ధాని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే అమరావతి తీర్మానం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. 
 వైయ‌స్ఆర్‌సీపీ కి విలువలు ఉన్నాయి. మా నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే స్పందించాల్సి వస్తుంది. ఇంకా ఇలాగే పిచ్చి మాట్లాడితే చాలా గట్టిగా స్పందిస్తాం. అందుకే ఇకనైనా ఆమె పదవి గౌరవం నిలబెట్టుకుని వ్యవహరించాలని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని నాగ మల్లీశ్వరి హోం మంత్రి అనిత‌ను హెచ్చ‌రించారు.