రేపటి సమావేశంలో సీఎం వైయస్ జగన్ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తారు
మంగళగిరి: వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు ఈ నెల 28వ తేదీ(మంగళవారం) జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రేపు మంగళగిరిలోని సీకే కన్వేషన్ హాల్లో జరుగనున్న పార్టీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లకు సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎలా పని చేయాలనేది పార్టీ అధినేత చెబుతారని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో వైయస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉందన్నారు. ఐదేళ్లుగా జరిగిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. క్యాడర్కు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా సీఎం సూచనలు చేస్తారని తెలిపారు.