అయ్యన్నా.. స్థాయి మరిచి మాట్లాడకు
8 Feb, 2020 18:09 IST
విశాఖ: తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి మీకు కనబడలేదా..? అని ప్రశ్నించారు. విశాఖలో దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని అయ్యన్నకు తెలియదా..? అని నిలదీశారు. విమ్స్ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా..? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బాబు ఏం చేశారో అయ్యన్నకు తెలియదా..? విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే.. ఈ ప్రాంత వ్యక్తిగా వ్యతిరేకించడం అన్యాయం కాదా..? అని ధ్వజమెత్తారు. కమర్షియల్ శాఖ ట్రిబ్యునల్ కోర్టును వైయస్ఆర్ విశాఖలో ఏర్పాటు చేస్తే.. విజయవాడ తరలించినప్పుడు అయ్యన్న ఎందుకు అడ్డుపడలేదని మండిపడ్డారు.