వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
అన్నమయ్య జిల్లా: మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి పై మారణాయుధాలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు కర్కశంగా దాడి చేసిన సంఘటనను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన హేయ చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజాపాలనకు బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. ఈ దాడి వెనుక ఉన్న దుండగులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సంఘటనపై తాను రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. అధికార పార్టీ వారి ప్రోత్సాహంతో నియోజక వర్గంలో మట్కా , గంజాయి బ్యాచ్ లు, ముసుగు దొంగలు వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలుపైన, బడుగు, బలహీన వర్గాలపైన, పేదల పైన,సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వ తప్పులును ప్రశ్నించిన వారిపైన దాడులకు పాల్పడుతుండడం అత్యంత సిగ్గుచేటు అని అన్నారు.ఇలాంటి ఘటనలు పెరగడానికి పోలీసు వ్యవస్థ గట్టిగా వ్యవహరించకపోవడం వల్లనే దౌర్జన్యాలు,దాడులు,అరాచకాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, వాటికి ఫుల్ స్టాప్ పడేలా చేయకపోతే పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి రౌడీ,గూండా రాజకీయాలు చేసిన వాళ్ళందరూ కాలగర్భంలో కలసి పోయారన్నారు. ఇటువంటి సంఘటనల పట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ మరియు తాము అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్నరోజుల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ శ్రేణులపై అన్యాయంగా,అక్రమంగా దాడులకు పాల్పడినవారిపై తీవ్ర పరిణామాలు వుంటాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.