హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఒక్కటయ్యాయని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎంత ఇతోధికంగా కాంగ్రెస్కు సాయం చేశారో తెలంగాణ ఎన్నికల్లో చూశామన్నారు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకులను ఏపీలో టీడీపీలో చేర్చుకుని వారికి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చి లబ్ధిపొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ను టీడీపీ నేతలు ఒక్క మాట కూడా అనడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీ చేస్తున్న కళ్యాణదుర్గానికి మాత్రమే రాహుల్ను తీసుకెళ్లారన్నారు. మిగతా వారు ఓడిపోయినా ఆయనకు సంబంధం లేనట్లుగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను రాహుల్ అన్ని రకాలుగా సమర్ధిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్– టీడీపీ లోపాయికారి ఒప్పందాన్ని గనమించాలని సూచించారు. కాంగ్రెస్ను ఎన్ని మాటలు అన్న తక్కువే అని, రాష్ట్రాన్ని విభజించిన ఆ పార్టీకి ఏపీలో కాలం చెల్లిందన్నారు.