ఏకగ్రీవాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు
తిరుపతి: చంద్రబాబుకు నమ్మినబంటుగా నిమ్మగడ్డ రమేష్కుమార్ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, మేకపాటి గౌతమ్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ తీరుపై చర్చించారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ బాధ్యతను మరిచి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడన్నారు. ఎస్ఈసీ నిబద్ధత లేని వ్యక్తి అని, నిమ్మగడ్డ రమేష్కుమార్ తలతిక్క పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్దంగా పనిచేయాలని ఎస్ఈసీని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నారు.