చట్టసభల్లో బీసీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట
విశాఖపట్నం: చట్టసభల్లో బీసీలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైయస్ఆర్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు అవమానాలు ఎదురవ్వగా.. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆత్మగౌరవం పెరిగిందన్నారు. గ్రేటర్ విశాఖపట్నం మద్దెల పాలెం పార్టీ ఆఫీసులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. మత్స్యకారులను చంద్రబాబు తాట తీస్తానంటే.. సీఎం వైయస్ జగన్ వారిని అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. మత్స్యకారులంతా కాలర్ ఎగురేసుకొని తిరిగేలా రాజకీయ ప్రాధాన్యం కల్పించారని ప్రశంసించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. తాజాగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారని తెలిపారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేదే ఈనాడు ఉద్ధేశమని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు బకాయి పెట్టిన రూ. 3600 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారని గుర్తు చేశారు. పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వంపై ఈనాడు తప్పుడు కథనాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో రామోజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుందని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.