మురళినాయక్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ ఆర్థికసాయం
శ్రీ సత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందిన అగ్నీవీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా నిలిచింది. ఈ నెల 13న వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మురళినాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని వైయస్ జగన్ కొనియాడారు. దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించగా, మురళీ నాయక్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు. శుక్రవారం వైయస్ జగన్ ఆదేశాలతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మురళి నాయక్ నివాసంలో ఆయన తల్లితండ్రులు జ్యోతిబాయ్,శ్రీరామ్ నాయక్కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని అధినేత హామీ ఇచ్చినట్లు మరోసారి ఉషశ్రీచరణ్ గుర్తు చేశారు.