మౌలానా అబుల్ కలాంకు వైయస్ఆర్సీపీ ఘన నివాళి
తాడేపల్లి: ఐఐటీలు, విశ్వవిద్యాలయాల స్థాపన ద్వారా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేశారని వైయస్ఆర్సీపీ నాయకులు కొనియాడారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్థంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును దేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకొంటున్నామని చెప్పారు. అల్-హిలాల్, అల్-బలాగ్ పత్రికల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉర్దూలో నడిపించారని, హిందూ ముస్లింల ఐక్యతను బలంగా సమర్ధించారని అన్నారు. ఆయన విద్యా రంగంలో చేసిన కృషికి గాను, ఆయనను ఆధునిక భారత విద్యా వ్యవస్థ రూపకర్తలలో ఒకరిగా పరిగణిస్తామని వివరించారు. గాంధీజీ ఆయన్ను భారత ప్లాటో అని, జవహర్లాల్ నెహ్రూ మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. 300 ఎకరాల్లో జామియా ఇస్లామియా డీమ్డ్ యూనివర్సిటీ, ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలు ఆయన కృషి ఫలితంగానే ఏర్పాటయ్యాయని నాయకులు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో వైయస్ జగన్ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని నాయకులు వెల్లడించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ ల పాలనతో రాష్ట్రంలో ముస్లింల జీవితాల్లో గణనీయమైన మార్పులొచ్చాయని గుర్తుచేసుకున్నారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల ఫలితంగా మెడికల్ కాలేజీల్లో ముస్లింలకు సీట్లు దక్కాయని, వైయస్ జగన్ స్థాపించిన 17 మెడికల్ కాలేజీల కారణంగా ఎంతోమంది ముస్లింలు డాక్టర్ కావాలన్న కలలను నెరవేర్చుకునే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు కొమ్మూరి కనకరావు, నాగ నారాయణ మూర్తి, ఏ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.