రంగు పూసినంత మాత్రాన వైయస్ఆర్ స్మృతులను చెరపలేరు
ప్రకాశం: అధికార మదంతో కూటమి నేతలు గ్రామాల్లో విద్వేశాలు రెచ్చగొడుతున్నారని వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగించడం, అరుగులపై రంగులు మార్చడం, చెట్లకు పసుపు రంగులు పూసినంత మాత్రానా మహానేత స్మృతులను చెరపలేరన్నారు. కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం గుల్ల సముద్రం గ్రామంలో పచ్చ మూకల దుచర్యలను ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలను ప్రజలు హర్షించరని ధ్వజమెత్తారు. ఆరుగులను పగలగొట్టడం అరుగుల మీద పసుపు రంగు పోయటం కూర్చునే దగ్గర చెట్లను నరకటం. మహానేత రాజశేఖర్ రెడ్డి విగ్రహం మీద పసుపు రంగు పూసిన అంత మాత్రాన ఆయన చేసిన మంచి పనులను చెరిపివేయలేరన్నారు. ఇలాంటి దుశ్చర్యల వల్ల వైయస్ఆర్పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని దూరం చేయలేరన్నారు. పార్టీలకు అతీతంగా వైయస్ఆర్, వైయస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందించారని, ప్రతి ఒక్కరూ తమ గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకోండి.. తప్పు చేశామనే రోజు మళ్ళీ వస్తుందన్నారు. మీకు అధికారం ఇచ్చినది ప్రజలను మంచిగా పరిపాలించమని, గ్రామాలలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య అశాంతిని నెలకొల్పుతున్న ఈ కూటమి నాయకులు కళ్ళు తెరవాలని సూచించారు. ప్రశాంతంగా ఉండే కొండేపి నియోజకవర్గంలో ఇలాంటి గొడవలు సృష్టించి ఏమి సాధించాలనుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.