ఈదుమూడిలో యాదవులపై దాడి హేయం
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో యాదవులు, బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, చంద్రబాబు బీసీలను భరించే క్యాస్ట్గా చూస్తూ తన సామాజికవర్గ నాయకులతో దాడులు చేయిస్తున్నాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈదుమూడి గ్రామంలో గొల్ల కాపరులుగా పనిచేస్తున్న యాదవులపై చంద్రబాబు సామాజికవర్గ టీడీపీ నాయకుల దాడిని ఖండించారు. యాదవులను గొల్ల నా కొడకల్లారా, లం* కొడకల్లారా, మీ అమ్మ, పెళ్లాం... అంటూ రాయలేని భాషలో దూషించడమే కాకుండా జుట్టు పట్టి టీడీపీ కార్యాలయంలోకి ఈడ్చుకొచ్చి కర్రలు, గడ్డపారలతో దాడి చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిన ఒంగోలు రూరల్ సీఐ, డీఎస్పీలను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న ఘటన జరిగితే బయటకు చెప్పనీయకుండా యాదవులను బెదిరించారని వివరించారు. యాదవ సంఘాల నేతృత్వంలో ధర్నా నిర్వహించి ఫిర్యాదు చేసే వరకు కూడా ఈ సంఘటన గురించి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ యాదవుల పట్ల చంద్రబాబు అమానుషంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు కూటమి అరాచకాలను భరించే బీసీలే బరితెగిస్తే ప్రభుత్వం పతనం కావడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా యాదవులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయడంతోపాటు వారిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- న్యాయమడిగితే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి చంపబోయారు
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు అండ్ కో చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి. వారు చేస్తున్న అరాచకాలతో రాష్ట్రంలో బీసీలకు రక్షణ కరువైంది. ఈ రాష్ట్రంలో బీసీలకు, దళితులకు బతికే స్వేచ్ఛ లేకుండా పోయింది. చంద్రబాబు పీ4 మోడల్ తీసుకొచ్చి బాపట్ల జిల్లా చినగంజాం మండలం చిన్నగొళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి మోడల్గా తీర్చిదిద్దుతానని చెప్పాడు. తీరా చూస్తే ఈ గ్రామానికి చెందిన కొంతమంది యాదవులు గొర్రెల కాపరి పనులు చేస్తూ జూన్ 7న పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి వెళ్లారు. ఈ ఈదుమూడి గ్రామం ప్రభుత్వ సీఎస్ సాయిప్రసాద్ గారి సొంత గ్రామం కూడా. గొర్రెల కాపరి పనులు చేస్తూ ఈదుమూడి గ్రామానికి వెళ్లిన యాదవులు పొలంలో ఉండగా చంద్రబాబు కులస్తులు.. ఒరేయ్.. గొల్ల నా కొడకల్లారా ఒక్క దెబ్బకే చంపేస్తాం.. ఒరేయ్ లం.. కొడకల్లారా.. అంటూ కర్రలతో దాడికి దిగారు. నోరు తెరిస్తే చంపేస్తాం.. అంటూ యాదవ కులస్తుల ఇంట్లో మహిళలను రాయలేని భాషలో దారుణంగా దూషించారు. యాదవ కులస్తులను ఉద్దేశించి లం.. కొడకల్లారా.. అని దారుణంగా తిట్టడమే కాకుండా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తే.. ఒక్కసారి కాదు.. వందసార్లు తిడతామని కర్రలతో దాడి చేశారు. దీనిపై కలత చెందిన బాధితులు మధు, అనిల్.. గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అక్కడా వారికి న్యాయం జరగకపోగా యాదవులిద్దర్నీ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి గడ్డపారలతో, కర్రలతో దాడి చేసి చంపేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ దాడి ఘటన గురించి ఎవరికైనా చంపేస్తామని తెలుగుదేశం నాయకులను యాదవులను బెదిరించారు. ఈ విషయం గురించి తెలిసిన యాదవ ప్రముఖులు కలగజేసుకోవడంతో పంచాయతీ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి చేరింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు, డీఎస్సీ రాయపాటి శ్రీనివాసరావులు ఈ ఘటనలో కలుగజేసుకుని యాదవులపై వారి సామాజికవర్గ టీడీపీ నాయకులు చేసిన దాడిని, అరాచకాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. బాధితుడైన అనిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కర్రలు, గడ్డపారలతో వారిని చంపడానికి ప్రయత్నంచినందుకు హత్యాయత్నం కేసు లేదు. కులం పేరుతో దూషించిన సెక్షన్ కింద కేసు లేదు. ఏవో చిన్నచిన్న కేసులు పెట్టి వదిలేశారు. చంద్రబాబు సామాజికవర్గ టీడీపీ నాయకుడు పుప్పాల వెంకట సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుతో బాధితులైన యాదవులపైనే కేసులు పెట్టారు. ఈ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టర్కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు శూన్యం. దాడిలో పాల్గొన్న టీడీపీ కమ్మ సామాజివర్గ నాయకులకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇంతఘోరం ఇంకోటి ఉంటుందా? ఇంత దారుణం జరిగినా జిల్లా ఎస్పీ ఏమీ ఎరగనట్టే వ్యవహరిస్తున్నారు. ఒక వర్గానికి మద్దతుగా వ్యవహరించిన సీఐ, డీఎస్పీల మీద కూడా కనీసం చర్యల్లేవు. మేం ఫిర్యాదు చేసే వరకు కూడా జిల్లా కలెక్టర్కి ఏం జరిగిందో తెలియదు.
- యాదవులపై దాడిని ఖండించలేరా? బాధితులను కనీసం పరామర్శించలేరా ?
గొర్రెల కాపరులుగా పనిచేస్తున్న యాదవులను దారుణమైన భాషతో దూషించిందే కాకుండా వారిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించినా టీడీపీలో బీసీ నాయకులెవరూ స్పందించకపోవడం సిగ్గుచేటు. పదవుల కోసం చంద్రబాబు సామాజికవర్గ నాయకులకు వంతపాడటం హేయం. మంత్రులుగా ఉన్నబీసీ నాయకులు కనీసం చట్టప్రకారం వ్యవహరించమని కూడా జిల్లా ఎస్పీకి చెప్పలేకపోయారంటే యాదవులకు బతికే హక్కు లేదనేగా? ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారే కానీ బీసీలపై దాడులు చేస్తున్న వారిని మాత్రం ఉపేక్షించి వదిలేస్తున్నారు. కూటమిలో ఉన్న యాదవ, బీసీ నాయకులు, యాదవ ఎమ్మెల్యేలు, మంత్రులకు కనీసం పరామర్శించే తీరిక కూడా లేకపోయింది. పదవులిచ్చినందుకు చంద్రబాబు సామాజికవర్గానికి కొమ్ము కాయడం సిగ్గుచేటు.
- బరితెగించే క్యాస్ట్గా మారితే మీ పరిస్థితి ఏంటో?
కూటమి ప్రభుత్వంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి అర్థమే మార్చేసి చంద్రబాబు భరించే క్యాస్ట్గా చూస్తున్నాడు. చంద్రబాబు సామాజికవర్గ నాయకులు ఏం చేసినా బీసీలు భరిస్తూనే ఉండాలన్నట్టుగా తయారైంది. తోకలు కత్తిరిస్తామన్నా, తల్లులు, భార్యలను దూషించినా భరించాలి. న్యాయమూర్తులగా పనికిరారన్నా భరించాలి. గొల్ల నాకొడకల్లారా అన్నా భరించాలి. కొట్టినా, చంపినా భరించాలి. ఇలాగే దాడులు చేస్తే ఈ భరించే క్యాస్ట్ బరితెగించే క్యాస్ట్గా మారి మా తడాఖా చూపిస్తామని చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు బాధితులపైనే కేసులు నమోదు చేసి కేసు నీరుగార్చడానికి ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. యాదవ సోదరులపై పోలీసులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తక్షణం రద్దు చేయాలి. లేదంటే కూటమి ప్రభుత్వం యాదవులకు వ్యతిరేకం అని భావించాల్సి ఉంటుంది. బీసీలే కదా అని నిందితులకు వంతపాడితే రాబోయేరోజుల్లో బీసీల తడాఖా చూపిస్తాం. రానున్న రోజుల్లో బీసీ నాయకులు ఈదుమూడి గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడతామని నాగార్జున యాదవ్ స్పష్టం చేశారు.