లడ్డు వివాదం డైవర్షన్ కోసం వైయస్ఆర్సీపీ నేతలపై దాడులు
నంద్యాల జిల్లా : లడ్డు వివాదాన్ని డైవర్షన్ చేయడానికి టీడీపీ గూండాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైయస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వం ఇలాంటి అటవిక పాలనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. లడ్డు వివాదాన్ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా, ప్రశ్నించే వైయస్ఆర్సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న ఈ దాడులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని గుర్తుచేస్తూ, దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని కోరారు.