సభ్యుల హక్కులను కాపాడాలి
అమరావతి: శాసనమండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులను హరించేలా ఉన్నాయని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. శుక్రవారం శాసన మండలిలో మొత్తం వీడియో ఫుటేజీలను విడుదల చేయాలని కోరుతూ వైయస్ఆర్సీపీ సభ్యులు సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారని, మొత్తం ప్రొసీడింగ్స్ ఫుటేజ్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
సభ్యుల హక్కులు హరించేలా విధానాలు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
శుక్రవారం పోడియం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న భాగాలనే విడుదల చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మొత్తం ఫుటేజ్ కోరినా స్పందన లేదు. ప్రజల హక్కులను కాపాడేందుకే తాము పోరాడుతున్నాం. సీఎం చంద్రబాబు బూట్లు వేసుకుని గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు, తమపై మాత్రం చెప్పుల వివాదాన్ని ప్రచారం చేస్తున్నారు.
టిటిడి నెయ్యి టెండర్లపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి టెండర్ల వెనుక ఉన్న నిజాలను వెలికితీయాలి. హెరిటేజ్- ఇందాపూర్ డెయిరీ వ్యవహారంతో ఉన్న సంబంధాలపై చర్చ జరగాలి. తాము దేవుడి ఫోటోలతో మాత్రమే నిరసన తెలిపాం, చెప్పులతో పోడియం వద్దకు వెళ్లలేదు. తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు వాడలేదు.
వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి: తూమాటి మాధవరావు
పోడియం వద్ద తాను చెప్పులు వేసుకుని వెళ్లినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాం. సభ ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కవరేజ్ ఇవ్వడం సరికాదు.
మండలి చైర్మన్పై ప్రభుత్వం వివక్ష: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
మండలి చైర్మన్ మోషేన్రాజును కూటమి ప్రభుత్వం గౌరవించడం లేదు, కేవలం దళితుడైనందునే వివక్ష చూపుతున్నారు.
లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
ఇందాపూర్ అంశంపై చర్చ పెట్టాలని ఐదురోజులుగా కోరుతున్నాం. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరిగింది. ఇలాంటి చర్యలు సరికాదు.
శాంతిభద్రతలు క్షీణించాయి: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. లడ్డూ అంశంపై ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. శుక్రవారం మండలిలో పూర్తి వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి, ఇందాపూర్–హెరిటేజ్ వ్యవహారంపై చర్చ జరపాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.