రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రజలకు అత్యంత కీలకం
అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాంత రైతులకు, ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి నెలకొందని ఆయన మండలిలో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధ్య జరిగిన ఏకాంత సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరినట్లు వచ్చిన వార్తలపై టీడీపీ నేతలు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంతంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం సీమ హక్కుల పరిరక్షణపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆక్షేపించారు. రాయలసీమ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.