పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం
అమరావతి: ఏపీలో సామాజిక న్యాయం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయ పదవుల్లో బీసీ, ఎస్సీ,, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్నారని ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు.
సొంత సామాజికవర్గం కోసమే చంద్రబాబు కృషి
చంద్రబాబు నమ్మక ద్రోహి. కుల అహంకారి. 1999 నుంచి రాజకీయాల్లో ఉన్న నేను ఆయన నైజాన్ని చూశా. నా దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. నాతోనే మిగిలిన నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టించారు. 2014లో నేను గెలిచే సీటు అని తెలిసినా, నన్ను పోటీ చేయకుండా ఆపేశాడు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు.. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. డబ్బున్న వారికే టీడీపీ టికెట్లు ఇస్తుంది. సొంత సామాజిక వర్గం బాగు కోసమే చంద్రబాబు పని చేశారు. బెంజ్ కారులో తిరిగిన నన్ను డొక్కు కారులో తిరిగేలా చేశారు. ఇప్పుడు సీఎం వైయస్ జగన్ అనే దేవుడి రూపంలో నాకు న్యాయం జరిగింది. – జయమంగళ వెంకటరమణ (బీసీ, ఏలూరు జిల్లా)
నిశ్శబ్ద విప్లవానికి సీఎం శ్రీకారం
రాజకీయ సాధికారత అంటే పదవుల్లో మాత్రమే కాదు.. అధికారంలో కూడా పాలు పంచుకునేలా భాగస్వాములను చేయడమే అని సీఎం వైయస్ జగన్ నిరూపించారు. బలహీన వర్గాలకు మేలు చేయలన్నా బలమైన ఆలోచన ఉంటేనే ఇది సాధ్యం. సీఎం వైయస్ జగన్ ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టారు. – పెనుమత్స సూర్యనారాయణ రాజు (ఓసీ, విజయనగరం జిల్లా)
సీఎం వైయస్ జగన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య
2014–19 మధ్య టీడీపీ శాసనమండలికి 48 మందిని పంపగలిగితే, అందులో ఓసీలు 30 మంది కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే. టీడీపీ వంచనకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. సీఎం వైయస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 68.18 శాతం కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. చంద్రబాబు పెద్ద కుల అహంకారి. సీఎం వైయస్ జగన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య... - పోతుల సునీత (బీసీ, చీరాల, బాపట్ల జిల్లా)
బీసీ అంటే బ్యాక్ బోన్..
బీసీలంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్బోన్ క్లాస్ అని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ గుర్తించి ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్గా బీసీ, మండలి చైర్మన్గా ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ మహిళకు అవకాశం ఇచ్చారు. పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రా«ధాన్యమిచ్చారు. సీఎం వైయస్ జగన్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. – కోలా గురువులు (బీసీ, విశాఖ సౌత్)
సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం
కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం చెప్పారు సీఎం వైయస్ జగన్. గతంలో టీడీపీ అన్ని విధాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను వంచించింది. చెప్పిందొకటి. చేసింది మరొకటి. ఊపిరి ఉన్నంత వరకు సీఎం వైయస్ జగన్తో ఉంటాను. – బొమ్మి ఇజ్రాయేల్ (ఎస్సీ, (మాదిగ), అంబేడ్కర్ కోనసీమ జిల్లా)
మోసం చేసిన చంద్రబాబును నిలదీయాలి
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నందున చంద్రబాబు, ఎల్లో మీడియా.. రోజు వారీ తోలు బొమ్మలను తెచ్చి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చూస్తున్నారు. వారి మొహం మీద చరిచినట్లుగా అన్ని పదవుల్లోనూ, అధికారంలోనూ ఇంతగా అట్టడుగు వర్గాలకు వైయస్ఆర్ సీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని బీసీలను కోరుతున్నాం. ఎందుకు మోసం చేశావని చంద్రబాబును నిలదీయాలని కోరుతున్నాం. – చంద్రగిరి ఏసురత్నం (బీసీ. వెస్ట్ గుంటూరు)
గొప్ప మానవతామూర్తి
నమ్మకానికి, ఇచ్చినమాట నిలబెట్టుకునేదానికి సీఎం వైయస్ జగన్ ప్రతిరూపం. ఒకసారి మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెరవేర్చే తత్వం. ఇచ్చిన మాట మేరకు నాకు మేలు చేశారు. సీఎం వైయస్ జగన్ ఏమి చెబితే అది చేయటమే నా కర్తవ్యం. రాజకీయాల్లో గొప్ప మానవతా విలువలు వంట పట్టించుకున్న మానవతామూర్తి సీఎం వైయస్ జగన్. రాజకీయాల్లో సోషల్ ఇంజినీరింగ్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే. – మర్రి రాజశేఖర్ (ఓసీ, చిలకలూరిపేట)