కుప్పం: కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో చోటుచేసుకున్న మరణాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే కుప్పం టూర్లో చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు లా అండ్ ఆర్డర్ అంటే అస్సలు గౌరవం లేదని, ప్రతిపక్ష నేత హోదాలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. రోడ్డు షోలు, రహదారులపై మీటింగ్కు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పోలీసులపైనే దాడి చేశారన్నారు. కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్కు చంద్రబాబే కారణమన్నారు.
కందుకూరులో 8 మందిని, గుంటూరులో ముగ్గురిని చంపిన తరువాత రాష్ట్రంలో ఏ ప్రాంతానికి తనను రానివ్వరని తెలిసే.. సొంత నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నాడని, తన సభల వల్ల 11 మంది చనిపోయారనే పశ్చాత్తాపం కూడా చంద్రబాబులో లేదని ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. జీవో నెంబర్1 ప్రకారం రోడ్డు షోలకు అనుమతి లేదని చంద్రబాబు పీఏ మనోహర్కి పోలీసులు స్పష్టంగా చెప్పారన్నారు. పోలీసుల మాటను కూడా లెక్కచేయకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంకెంత మందిని చంపాలని కుప్పానికి చంద్రబాబు వచ్చాడని ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు.
ఏదో ఒక అలజడి సృష్టించి పోలీసులు కక్షగట్టారు, వైయస్ఆర్ సీపీ రానివ్వడం లేదని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడని మండిపడ్డారు. బాబు ర్యాలీలకు కుప్పం నుంచి జనం రావడం లేదని వీకోట, మదనపల్లె నుంచి జనాన్ని తరలించి ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో అనవసరమైన గొడవలు సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు.