రేపటి నుంచి ఏపీలో సువర్ణయుగం

29 May, 2019 11:23 IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి నుంచి సువర్ణ యుగం మొదలవుతుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాముడి రాజ్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారని, మనందరం చూశామన్నారు. మళ్లీ రామ రాజ్యాన్ని వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ తీసుకురానున్నారని చెప్పారు. ఓట్లు వేసిన ప్రజలందరూ కాలర్‌ ఎగురవేసుకొని చెప్పుకునేలా వైయస్‌ జగన్‌ అద్భుతమైన పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుబారా ఖర్చుల వల్ల ఈ రోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలు కట్టే పన్నుల డబ్బును దుర్వినియోగం చేయకూడదన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ నష్టాల్లో ఉందని,  ప్రతి పైసా ప్రజలకే ఖర్చు పెట్టాలని వైయస్‌ జగన్‌ తాపత్రయపడుతున్నారని చెప్పారు. నవరత్నాలను ప్రజలకు ఎలా అందించాలనే తపన వైయస్‌ జగన్‌లో ఉందన్నారు.