అనంతపురం: చంద్రబాబు, లోకేష్లను వెంటనే అరెస్టు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా డిమాండ్ చేశారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాను చోరీ చేసిన నేరంపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలన్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగ చంద్రబాబు, ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. వీరిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ప్రజల విలువైన సమాచారాన్ని దొంగిలించి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారని, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు.
కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాను చోరీ చేశారని, ఈ కేసులో ప్రధాన నిందితులు చంద్రబాబు, లోకేష్ అన్నారు. వీరి సహకారంతోనే డేటా లీక్ అయిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఫారమ్ –7 అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు పాలించాలని అధికారం ఇచ్చిన ప్రజలను చంద్రబాబు నడిరోడ్డున నిలబెట్టాడని రోజా ధ్వజమెత్తారు. చేసిన నేరాన్ని ఒప్పుకొని చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.